ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ అర్బన్ మొబిలిటీ దిశగా కీలక ముందడుగు పడింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) రష్యా రాజధాని మాస్కో నగర ప్రభుత్వంతో స్మార్ట్ మొబిలిటీ, సమగ్ర పట్టణ రవాణా అభివృద్ధికి సంబంధించి అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా విశాఖపట్నంలో ఆధునిక ప్రజా రవాణా, కృత్రిమ మేధస్సు ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ, డిజిటల్ టికెటింగ్, గ్రీన్ మొబిలిటీ వంటి రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ ప్రాజెక్టుకు పునాది 2026 జూన్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన సందర్భంగా మాస్కో రవాణా అధికారులతో జరిగిన చర్చల ద్వారా పడింది. అనంతరం మాస్కోలో నిర్వహించిన ఐదో అంతర్జాతీయ రవాణా సదస్సులో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ (IAS), మాస్కో డిప్యూటీ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్ విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ప్రపంచంలో అత్యంత ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలను కలిగి ఉన్న నగరాల్లో మాస్కో ఒకటి. అక్కడ మెట్రో, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రామ్లు, సబర్బన్ రైలు సేవలు పరస్పరం అనుసంధానమై పనిచేస్తున్నాయి. అన్ని రవాణా సేవలను ఉపయోగించేందుకు ‘ట్రొయికా’ (Troika) అనే ఒకే స్మార్ట్ కార్డు వినియోగంలో ఉంది. అలాగే కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ విజన్, డేటా అనలిటిక్స్ ఆధారంగా ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ ద్వారా రద్దీని సమర్థంగా నియంత్రిస్తున్నారు.
మాస్కోలో అమలవుతున్న ఈ సాంకేతిక నమూనాలను విశాఖపట్నం అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దే దిశగా ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. నగర భౌగోళిక పరిస్థితులు, భవిష్యత్ జనాభా పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించనున్నారు.
ఈ ఒప్పందం కింద కృత్రిమ మేధస్సు ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలు, నగరంలోని అన్ని ప్రజా రవాణా సేవలకు ఒకే డిజిటల్ కార్డు లేదా క్యూ ఆర్ ఆధారిత టికెటింగ్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై అధ్యయనం, తక్కువ ఉద్గారాలతో పర్యావరణహిత రవాణా వ్యవస్థల అభివృద్ధి, ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగాల్లో సహకారం, ఇంజినీర్లు మరియు ప్రభుత్వ అధికారులకు సాంకేతిక శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ విశాఖపట్నాన్ని పారిశ్రామిక, సాంకేతిక, పర్యాటక రంగాల్లో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం కీలక మలుపుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ మాస్కో రవాణా రంగంలో ఉన్న అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాలను జీవీఎంసీ అధికారులు అందిపుచ్చుకునే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభిస్తుందని తెలిపారు. విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖను దేశంలోనే అత్యాధునిక స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఈ ఒప్పందం బలమైన పునాది వేస్తుందని అన్నారు.
స్మార్ట్ మొబిలిటీ, డిజిటల్ రవాణా, గ్రీన్ టెక్నాలజీ, అంతర్జాతీయ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం భవిష్యత్ పట్టణాభివృద్ధికి కొత్త దిశగా ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం భావిస్తోంది. ప్రణాళికలు విజయవంతంగా అమలైతే ప్రజా రవాణా మరింత సౌకర్యవంతంగా మారడమే కాకుండా ట్రాఫిక్ రద్దీ తగ్గడం, కాలుష్యం నియంత్రణ, సాంకేతిక ఆధారిత పట్టణ పాలనకు విశాఖపట్నం దేశంలోనే ఆదర్శ నగరంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
