రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని మరింత విస్తరించడంతో పాటు మత్స్యకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్, మోపెడ్లు, రిటైల్ అవుట్లెట్ షాపుల ఏర్పాటు కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షిస్తామని మంత్రి వెల్లడించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించడంతో పాటు మత్స్యకారులకు సంబంధించిన పెండింగ్ బకాయిల విడుదలకు ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరిచే దిశగా మధ్యాహ్న భోజన పథకంలో చేపలను చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు నెలకొన్న సహకార సంఘాల సభ్యత్వ వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్ కోహెడలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ పూర్తయిన తర్వాత ఆన్లైన్ ద్వారా చేపల విక్రయాలు, పంపిణీకి అవకాశం ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారులకు సంబంధించిన రూ.1.34 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్లను ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ చేసిందని తెలిపారు.
మత్స్య సహకార సంఘాల అధ్యక్షులకు ప్రోటోకాల్ అంశంపై ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
