అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నదా? ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతున్న విషయాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తున్నది. అయితే అమెరికా ఎన్నికల్లో చైనా ఎలా జోక్యం చేసుకుంటుంది? అనే ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతున్నది.
ట్రంప్ మాట్లాడుతూ చైనా అక్రమంగా 22 కోట్ల అమెరికా ఓటర్ల వివరాలను సేకరించిందని ఆరోపించారు. ఇందులో పేర్లు, చిరునామాలు, ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఇతర వివరాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా గూఢచారి వ్యవస్థలోని కొంతమంది అధికారులు చైనా కార్యకలాపాల తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని కూడా ఆయన ఆరోపించారు. ఈ పత్రాలు ఎన్నికల మౌలిక సదుపాయాల్లో “ఆశ్చర్యకరమైన బలహీనతలను” బయటపెడతాయని ఆయన అన్నారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా గూఢచారి వ్యవస్థ 2021లో విడుదల చేసిన అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ నివేదిక ప్రకారం 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటరు నమోదులు, బ్యాలెట్లు, ఓట్ల లెక్కింపు లేదా ఫలితాల వంటి సాంకేతిక అంశాల్లో ఏ విదేశీ శక్తి జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినట్లు లేదా విజయవంతమైనట్లు ఆధారాలు లేవని పేర్కొంది. ఆ సమయంలో జాతీయ గూఢచారి విభాగానికి ట్రంప్ నియమించిన జాన్ రాట్క్లిఫ్ అధిపతిగా ఉన్నారు.
ఆ నివేదికలో చైనా కనీసం 2008 నుంచి అమెరికా ఓటర్లు, ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉన్నత ప్రభుత్వ అధికారులపై సమాచార సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడమే లక్ష్యమై ఉండవచ్చని గూఢచారి వర్గాలు భావించాయి. అయితే చైనా సేకరించిన ఓటరు సమాచారం రహస్యమైనది కాదని, రాజకీయ సలహాదారులు సాధారణంగా కొనుగోలు చేసే పబ్లిక్ డేటా మాత్రమేనని, దాన్ని మార్చడం సాధ్యం కాదని విషయాన్ని తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఒక వార్తా సంస్థకు తెలిపారు.
ట్రంప్ ప్రసంగానికి ముందు కూడా వైట్ హౌస్లో కొంత ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. చైనా సమాచారాన్ని బహిర్గతం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని కొంతమంది అధికారులు భావించినట్లు ఆ వార్తా సంస్థ కూడా పేర్కొంది. ట్రంప్ చైనాపై చేసిన కఠిన వ్యాఖ్యలు గత ఏడాది వాణిజ్య యుద్ధం తర్వాత స్థిరపడిన ద్వైపాక్షిక సంబంధాలను మళ్లీ దెబ్బతీయవచ్చని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ సెప్టెంబర్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కావాలని ఆశిస్తున్నారు.
ఎన్నికల భద్రతపై కొత్త చట్టం అవసరమని ట్రంప్ మరోసారి డిమాండ్ చేశారు. ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడం, ఓటరు నమోదుకు అమెరికా పౌరసత్వ ఆధారాలు చూపడం, పోస్టల్ ఓటింగ్ను గణనీయంగా పరిమితం చేయడం వంటి నిబంధనలు కలిగిన “సేవ్ అమెరికా చట్టం”ను ఆమోదించాలని కాంగ్రెస్లోని రిపబ్లికన్ సభ్యులను కోరారు. ఈ బిల్లును ప్రతినిధుల సభ ఇప్పటికే పలుమార్లు ఆమోదించినప్పటికీ, సెనేట్లో డెమోక్రాట్ల తీవ్ర వ్యతిరేకత కారణంగా ముందుకు సాగడం లేదు.
డెమోక్రాట్లు, ఓటు హక్కుల సంస్థలు ఈ బిల్లును చట్టబద్ధమైన ఓట్లను అణచివేయడానికి చేసే ప్రయత్నంగా విమర్శిస్తున్నాయి. సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఉపాధ్యక్షుడు మార్క్ వార్నర్ ట్రంప్ ఆరోపణలను “పూర్తిగా తప్పుడు”వని పేర్కొన్నారు. చైనా 2020 ఎన్నికల్లో ఒక్క ఓటును కూడా మార్చేందుకు ప్రయత్నించలేదని అమెరికా గూఢచారి సంస్థలు ఏకగ్రీవంగా నిర్ణయించాయని ఆయన అన్నారు.
ట్రంప్ ప్రసంగంలో విడుదల చేసిన పత్రాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఒక సీఐఏ పత్రం వెనిజువెలా ఎన్నికలకు సంబంధించినదిగా ఉండగా, మరొక పత్రంలో ఓట్ల లెక్కింపు వ్యవస్థలను విస్తృత స్థాయిలో ప్రభావితం చేయడం కష్టమని స్పష్టంగా పేర్కొనబడింది. ఇంకొక పత్రంలో చైనా గూఢచారులు బైడెన్ ప్రచార బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే రహస్య జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రస్తుతం లేదని పేర్కొంది.
ట్రంప్ 2020 ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఎదురైన పరాజయం అక్రమమని సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నారు. పోస్టల్ ఓటింగ్లో భారీ మోసాలు జరుగుతున్నాయని, ఓటింగ్ యంత్రాలు బలహీనంగా ఉన్నాయని, పౌరులు కాని వారు పెద్ద ఎత్తున ఓటు వేస్తున్నారని కూడా ఆయన గతంలో ఆరోపించారు. అయితే అనేక కోర్టులు, రీకౌంట్లు 2020 ఎన్నికల్లో పెద్ద స్థాయి మోసాలకు ఆధారాలు లేవని తేల్చాయి.
ఇటీవల ఇరాన్ యుద్ధం, అధిక ఇంధన ధరలు, ఆర్థిక వ్యవహారాలపై అసంతృప్తి కారణంగా ట్రంప్ ప్రజాదరణ దెబ్బతిన్న సమయంలో ఈ కీలక అంశాలను ట్రంప్ లేవనెత్తుతున్నారు. ప్రసంగం ప్రారంభంలో మాత్రమే ఇరాన్ యుద్ధాన్ని ప్రస్తావించిన ట్రంప్, తరువాత పన్ను తగ్గింపులు, వలస నియంత్రణ వంటి దేశీయ అంశాలపై మాట్లాడారు. అమెరికన్లకు ముఖ్యమైన అధిక జీవన వ్యయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కొంతమంది రిపబ్లికన్ నాయకులు ట్రంప్కు సూచిస్తున్నట్లు సమాచారం.
