నెల్లూరు నగరంలో ఇటీవల సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడుతో జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం, నేరాలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరిక జారీ చేసే ఉద్దేశంతో పోలీసులు నిందితులకు కఠినమైన ‘ట్రీట్మెంట్’ ఇచ్చారు.
గాంధీ బొమ్మ కూడలి నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఈ ఐదుగురు నిందితులను రోడ్డుపైన నడిపిస్తూ ఊరేగించారు. దాడులు, హత్యలకు పాల్పడితే ఇక నుంచి నిందితులకు ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు బహిరంగంగా హెచ్చరించారు.
యువత సన్మార్గంలో నడుచుకోవాలని, నేరాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. అంతేకాక, పిల్లలు తప్పుదోవ పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, వారు తగిన జాగ్రత్తలు వహించాలని పోలీసులు కోరారు.
