అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పోలీసు యంత్రాంగం భారీ కవాతు (మార్చ్ పాస్ట్) నిర్వహించింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం మరియు శాంతిభద్రతల పరిరక్షణపై భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ‘విజిబుల్ పోలీసింగ్’లో భాగంగా నిర్వహించిన ఈ కవాతు రాయచోటి పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, ప్రధాన మార్కెట్ ప్రాంతం, ఠాణా సర్కిల్, రవి థియేటర్ సెంటర్, బంగ్లా సర్కిల్, శివాలయం చెక్ పోస్ట్ మరియు ఆర్టీసీ బస్టాండ్ వంటి ప్రధాన కూడళ్ల మీదుగా తిరిగి పోలీస్ స్టేషన్ వరకు సాగింది.
ఈ సందర్భంగా రాయచోటి పట్టణ సీఐ బి.వి. చలపతి మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు విష్ణువర్ధన్, జహీర్ తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది మరియు సాయుధ బలగాలు పాల్గొని, పోలీసు శాఖ అప్రమత్తతను చాటిచెప్పారు.
