కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీ డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. విమానాశ్రయ ఆవరణలోని ఇంధన ట్యాంకును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని కువైట్ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ అధికారికంగా ధృవీకరించింది.
సంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పౌర విమానయాన సంస్థ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ మాట్లాడుతూ.. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ దాడిలో కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.
విమానాశ్రయ భద్రతా యంత్రాంగం మరియు సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యవసర ప్రోటోకాల్స్ను అమలు చేశారని ఆయన వెల్లడించారు. ఈ దాడి వెనుక ఉన్న కారణాలపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.
