మచిలీపట్నం.. విజయవాడ.. గుంటూరు.. మూడు నగరాల మధ్యలో ఉన్న 110 కిలోమీటర్ల దూరాన్ని రాజధాని కారిడార్గా ప్రకటించాలని వైసీపీ అధినేత జగన్.. కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని వాదిస్తున్న జగన్.. అందులో పదిశాతం వెచ్చిస్తే మావిగన్ పూర్తవుతుందని సెలవిచ్చారు.
మావిగన్ మీద నెటిజన్లు పేలుస్తున్న జోకులు.. వేస్తున్న సెటైర్లను పక్కన పెడితే.. పేరు మారింది గానీ.. జగన్ చెప్పిన ఐడియా కొత్తదేమీ కాదు. ఏపీ సీఆర్డీఏ.. అంటే ఆంధ్రప్రదేశ్ కేపిటల్ ఏరియా డెవలప్మెంట్ అధారిటీ పరిధిలో.. జగన్ చెప్పిన మావిగన్తో పాటు ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి.
మంగళగిరి, తెనాలి, గుంటూరు, విజయవాడ, నందిగామ, మైలవరం, గుడివాడ వంటి అనేక నగరాలు, పట్టణాలతో పాటు వేలాది గ్రామాలు సీఆర్డీయే పరిధిలోకి వస్తాయి. ఇంకో ఇరవై కిలోమీటర్లు పొడిగిస్తే మచిలీపట్నం కూడా సీఆర్డీయే పరిధిలోకి వస్తుంది.
ఒక సిటీని రాజధానిగా ప్రకటించగానే అభివృద్ధి జరగదు. ఆ ప్రాంతం విద్య, వైద్య, ఉపాధి కేంద్రంగా మారాలంటే.. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి.. ప్రైవేటు సంస్థలు రావాలి. అందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలు వేలు, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఎస్టాబ్లిష్ అయిన సిటీలో రాజధాని ఏర్పాటు చేస్తే ఖర్చు ఉండదని జగన్ చేస్తున్న వాదనలోనూ నిజం లేదు.
కొత్తగా రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు.. డ్రైనేజీ వ్యవస్థలు నిర్మించకపోతే బెంగళూరు సిటీలా ట్రాఫిక్ నరకం, నీటి కష్టాలు కొనితెచ్చుకొన్నట్లే. ప్రజల అవసరాలు, సమస్యల గురించి ఆలోచించే దార్శనికత ఉన్న నాయకులెవరూ ఇలాంటి ముందు చూపు లేని, నిర్లక్ష్యపూరితమైన ఆలోచన ఆచరణలో పెట్టాలని చెప్పరు.
జగన్ భాషలో మావిగన్.. కూటమి ప్రభుత్వం చెబుతున్న సీఆర్డీయే.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే.. కనీసం పదిహేనేళ్లు పడుతుంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి ఉండదని ఐదేళ్ల జగన్ పాలనలో నిరూపించారు. ఈ లెక్కన జగన్ కోరిక ప్రకారం మావిగన్ సాకారం కావాలంటే.. కూటమి ప్రభుత్వం కనీసం మూడు సార్లు గెలవాలి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి.. అప్పుడే ఏపీ రాజధాని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పోటీ పడే స్థాయిలో డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించారు కాబట్టే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు.. కూటమిని పదిహేనేళ్లు అధికారంలో ఉంచాలని ప్రజలను కోరుతున్నారు. మావిగన్తో జగన్ కూడా అదే మాట చెప్పినట్లయింది.
