భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. శనివారం సాయంత్రం తీవ్రమైన అలసట, ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ (అవయవాల వైఫల్యం) గుండెపోటు కారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఆశా భోంస్లే మరణవార్తను ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే మీడియాకు తెలియజేస్తూ, సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన తన సుదీర్ఘ ప్రయాణంలో ఆశా భోంస్లే 20కి పైగా భాషల్లో దాదాపు 12,500 కంటే ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 1943లో మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, భారతీయ సినిమా సంగీత గమనాన్ని మార్చివేసింది.
మెలోడీ పాటలైనా, క్యాబరే సాంగ్స్ అయినా, గజల్స్ అయినా ఆమె గొంతులో పలికిన విలక్షణత అద్వితీయం. ఆమె మృతి పట్ల భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంగీత సరస్వతి తన గళాన్ని మూగబోయేలా చేసిందని, ఆమె పాటలు సంగీత ప్రియుల హృదయాల్లో కలకాలం చిరంజీవిగా ఉంటాయని అభిమానులు నివాళులర్పిస్తున్నారు.
