సినీ పరిశ్రమలో మరోసారి విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ (31), సినీ కెమెరామెన్ త్రిలోక్ (31) దుర్మరణం చెందారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురవడంతో, తీవ్ర గాయాలపాలైన వీరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
భరత్ కాంత్ ఇటీవల విడుదలైన ‘టెనెంట్’ చిత్రంతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన, అంతకుముందు పలు సినిమాల్లో సహాయ నటుడిగా కీలక పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు త్రిలోక్ కూడా పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పని చేస్తూ కెరీర్లో ఎదుగుతున్నారు.
ఒకే వయసున్న ఈ ఇద్దరు యువ ప్రతిభావంతులు ఒకే ప్రమాదంలో మరణించడం టాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. చేతికందిన కొడుకులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
