చిత్తూరుహోమ్

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం

#VenkaiahChowdary

భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో మంగళవారం, టీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహార భద్రత, పరిశుభ్రతలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం టీటీడీ బాధ్యత అని అన్నారు. ఆహార తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియల్లో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఇప్పటికే తిరుమలలో ఆహార భద్రత, పరిశుభ్రతపై పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినప్పటికీ, వాటిని నిరంతరం కొనసాగించేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో అవసరమని చెప్పారు. టీటీడీ అన్నప్రసాదంలో నాణ్యమైన ఆహార ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తోందన్నారు. అదే రీతిలో తిరుమల లోని వివిధ హోటల్స్ కూడా ఉన్నత ఆహార ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.

తిరుమలలో ప్రస్తుతం సుమారు 325 దుకాణాల్లో(street vendors) ఆహార విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాటిలో దాదాపు 1,300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థల యజమానులు తమ సిబ్బందికి పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.

నెస్లే ఇండియా సంస్థ ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారికి గ్లోవ్స్, ఆప్రాన్, సబ్బులు, టోపీలు తదితర వస్తువులు ఉండే కిట్లను ఉచితంగా అందజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఆహార విక్రయ కేంద్రాల్లో మరింత పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు.

ఈ శిక్షణలో ఆహార భద్రతా ప్రమాణాలు, చట్టబద్ధ నిబంధనలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమలలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం, భక్తులకు సురక్షితమైన ఆహారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు ఈవో తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధారాణి, క్వాలిటీ మేనేజర్ లక్ష్మీ నారాయణ రెడ్డి, FSSAI ప్రతినిధులు, నెస్లే ఇండియా మేనేజర్ వసీమ్ అహ్మద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

తండ్రి చనిపోయిన రోజు…. కోల్‌కతాలో సూట్‌కేసులతో జగన్‌..??

Satyam News

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్

Satyam News

గ్లోబల్ సి బి ఎస్ ఈ  స్కూల్ కు నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు

Satyam News

పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట

Satyam News

కుటుంబ వివాదాలతో జగన్‌ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్….!!

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో రెండో రోజు సి ఎస్ ఎం ఆర్ ఎస్ పరీక్షలు

Satyam News

Leave a Comment