ఫిలిప్పీన్స్ మొత్తం భూ కంపంతో వణికిపోయింది. దక్షిణ ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా కనీసం నలుగురు మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం అనంతరం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియోలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.
వైరల్ వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు భయంతో పరుగులు తీయడం, నిర్మాణాలు బలంగా ఊగిపోవడం కనిపించింది. ఒక వీడియోలో పాఠశాల మైదానంలో పిల్లలు గుమికూడిన సమయంలో ఏర్పాటు చేసిన షెల్టర్ ఒక్కసారిగా కూలిపోవడం కనిపించింది. నిర్మాణం కూలే క్షణాలకు ముందు ఉపాధ్యాయుడు విద్యార్థులకు భూకంప సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నేర్పుతున్న దృశ్యాలు నమోదయ్యాయి.
మరో వీడియోలో భవనం కూలిపోతుండగా ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీస్తున్నట్లు కనిపించింది. మరో క్లిప్లో ఈత కొలనులోని నీరు తీవ్రంగా ఎగిసిపడుతూ భూకంపం ప్రభావాన్ని ప్రతిబింబించింది.
సోషల్ మీడియాలో పలువురు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రకృతి కొన్ని సందర్భాల్లో ఎంతో భయంకరంగా ఉంటుంది” అని ఒకరు వ్యాఖ్యానించగా, “ఇటీవలి సంవత్సరాల్లో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇది ఒకటి” అని మరొకరు పేర్కొన్నారు. “ఫిలిప్పీన్స్ ప్రజలు ధైర్యంగా ఉండాలి” అంటూ అనేక మంది మద్దతు సందేశాలు పంపించారు.
ఉదయం 7:37 గంటలకు సముద్ర గర్భంలో సంభవించిన ఈ భూకంప కేంద్రం దక్షిణ మిండనావో ప్రాంతంలోని జనరల్ సాంటోస్ నగరానికి నైరుతి దిశగా సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఈ ఏడాది ఫిలిప్పీన్స్లో నమోదైన అత్యంత తీవ్ర భూకంపంగా గుర్తించారు.
భూకంపం కారణంగా జనరల్ సాంటోస్ నగరంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. నగరానికి కీలకమైన ఒక వంతెన కూడా నష్టం చవిచూసింది. ప్రధాన ప్రకంపనల తర్వాత అనేక అనంతర ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రభావం సమీప మలేషియాలో కూడా అనుభూతి అయింది.
సుల్తాన్ కుదరత్, సారంగాని ప్రావిన్సుల్లో సుమారు ఒక మీటర్ ఎత్తైన సునామీ అలలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో కూడా చిన్నస్థాయి అలలు గుర్తించారు. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం ఫిలిప్పీన్స్ తీరప్రాంతాల్లో మూడు మీటర్ల వరకు సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇండోనేషియా, మలేషియాలోని కొన్ని తీర ప్రాంతాలకు కూడా ఒక మీటర్ వరకు అలల ప్రభావం ఉండవచ్చని తెలిపింది.
మలేషియా వాతావరణ శాఖ బోర్నియో ద్వీపంలోని సబా రాష్ట్రానికి సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ప్రభుత్వాలు తీరప్రాంత ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సూచించాయి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మర్కోస్ జూనియర్ ప్రమాదానికి గురయ్యే ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణ సంస్థలు అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
