రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళల రక్షణను గాలికొదిలేసిన వైసీపీ నేతలు, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా సంస్కారహీనతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న దళిత మహిళ, హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. అమర్నాథ్ వ్యాఖ్యలు కేవలం అనిత గారిని మాత్రమే కాదు, రాష్ట్రంలోని యావత్ మహిళా లోకాన్ని, దళిత సమాజాన్ని అవమానించడమే.
వైసీపీ పుట్టుకతోనే మహిళా వ్యతిరేక DNA ఉందనడానికి గత ఐదేళ్ల పాలనతో పాటు ప్రస్తుత వారి నేతల వైఖరే నిదర్శనం. అసెంబ్లీ సాక్షిగా మహిళపై సాగించిన క్యారెక్టర్ అస్సాసినేషన్ నుండి, ఇవాళ హోంమంత్రిపై చేస్తున్న నీచ వ్యాఖ్యల వరకు వైసీపీ ట్రాక్ రికార్డ్ మొత్తం మహిళలను కించపరచడమే లక్ష్యంగా సాగింది. మహిళా ప్రజాప్రతినిధి సమర్థవంతంగా పనిచేస్తుంటే, పాలనాపరమైన విషయాలపై మాట్లాడలేక, ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగడం గుడివాడ అమర్నాథ్ అహంకారానికి, ఆ పార్టీ సంస్కృతికి అద్దం పడుతోంది.
అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉండాలి తప్ప, ఒక మహిళా మంత్రి వ్యక్తిగత జీవితంపై బురదజల్లడం అత్యంత అభ్యంతరకరమన్నారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు కనీస విచక్షణ, జాగ్రత్త అవసరమని హితవు పలికారు. మహిళల కట్టూబొట్టుపై వ్యాఖ్యలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోవడం శోచనీయమన్నారు.
నారా లోకేష్ సైతం అమర్నాథ్పై విరుచుకుపడ్డారు. అనితపై చేసిన ఈ హీనమైన వ్యాఖ్యలు వైసీపీ నేతల అసలు క్యారెక్టర్ను, వారి దిగజారుడు సంస్కృతిని మరోసారి రాష్ట్ర ప్రజల ముందు బయటపెట్టాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, పాలన, శాంతిభద్రతలపై సమాధానం చెప్పలేకనే వైసీపీ నేతలు ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత కుటుంబం నుండి వచ్చి, స్వయంకృషితో, కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన మహిళా ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకోవడం వైసీపీ కుట్రపూరిత వైఖరికి నిదర్శనమని లోకేష్ మండిపడ్డారు. అనిత గారి రాజకీయ ప్రస్థానం రాష్ట్రంలోని మహిళలందరికీ రోల్ మోడల్ అని ప్రశంసించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళను కించపరిచినందుకు వైసీపీ నేతలు వెంటనే అనితకు, యావత్ దళిత సమాజానికి,రాష్ట్ర మహిళలందరికీ బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
