దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ బాగోతం ఒక్కొక్కటిగా బద్ధలవుతోంది. ఈ భారీ స్కామ్కు కేంద్ర బిందువుగా ఉన్న మాజీ ఐటీ సలహాదారు, సిండికేట్ మాస్టర్మైండ్ రాజ్ కెసిరెడ్డి, APSBCL మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిలను ED ఇప్పటికే అరెస్ట్ చేసింది.
తాజాగా వీరిచ్చిన లీకులతో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఇళ్లు, ఆఫీసులపై ED ఏకకాలంలో విరుచుకుపడింది. ఈ సోదాల్లో లగ్జరీ రోలెక్స్ వాచీలు, కట్టల కొద్దీ నగదు, బినామీ హవాలా నెట్వర్క్కు సంబంధించిన డిజిటల్ డివైజ్లను ED స్వాధీనం చేసుకోవడంతో జగన్ ప్యాలెస్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
మరోవైపు, ఈ మొత్తం దోపిడీ వెనుక సూత్రధారిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత PA కె. నాగేశ్వరరెడ్డి – KNR అసలు స్వరూపం SIT, ED దర్యాప్తులో బట్టబయలైంది. లిక్కర్ కిక్బ్యాక్లు, రవాణా కాంట్రాక్టుల సిండికేట్ ద్వారా KNR ఏకంగా రూ. 1,500 కోట్ల మేర అవినీతి ఆర్జన గడించినట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. జగన్ పేరు చెప్పుకుని మద్యం డబ్బును హవాలా మార్గంలో మళ్లించడమే కాకుండా, బినామీల పేరిట వందల ఎకరాల భూములు, లగ్జరీ విల్లాలను KNR కొట్టేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ED సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం.. APSBCL ద్వారా జరిగిన మద్యం రవాణా టెండర్లలో రూ. 349 కోట్లకు పైగా దోపిడీ జరిగింది. ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే సంస్థను ఫ్రంట్గా పెట్టి, తెర వెనుక రాజ్ కెసిరెడ్డి సిండికేట్ 96 శాతం నిధులను నొక్కేసింది.
ఈ రవాణా దోపిడీలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు ఖాతాల్లోకి కేవలం నగదు, హవాలా రూపంలో రూ. 15 కోట్లు ముట్టినట్లు ED స్పష్టమైన ఆధారాలు సేకరించింది. షెల్ కంపెనీల పేరిట బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి, ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోలోకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.
అధికారంలో ఉన్నప్పుడు జనానికి జే బ్రాండ్ తాగించి జేబులు గుల్ల చేసిన వైసీపీ ముఠా..ఇప్పుడు చట్టం ముందు నిలబడలేక వణికిపోతోంది. ఒకవైపు జగన్ PA KNR 1500 కోట్ల అక్రమ ఆస్తుల చిట్టా బయటకు రావడం, మరోవైపు రాజ్ కెసిరెడ్డి, వాసుదేవ రెడ్డిల అరెస్టులతో ఈ మద్యం సిండికేట్ లింకులు నేరుగా జగన్ మోహన్ రెడ్డి వైపునకే దారితీస్తున్నాయి.
తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, హవాలా దందాలు నడిపిన ప్రతి వైసీపీ నేతను బోనులో నిలబెడతామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే ఈ ఫేక్ లీడర్ల అసలు గుట్టు పూర్తిగా రచ్చకెక్కడం ఖాయం.
