భారత ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ పంపిన సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందీలో ప్రత్యేకంగా ఆయన మోడీకి వీడ్కోలు సందేశం పంపడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. గురువారం విడుదల చేసిన వీడియోలో మాక్రోన్, మోదీని “ప్రియ మిత్ర” అంటూ సంబోధిస్తూ ఫ్రాన్స్-భారత్ స్నేహం చిరస్థాయిగా కొనసాగాలని ఆకాంక్షించారు.
హిందీలో తన సందేశాన్ని పంపిన మాక్రోన్, “ప్రియ మిత్ర నరేంద్రా, నీస్, ఎవియన్, పారిస్ పర్యటనకు మీకు స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రాన్స్-భారత్ స్నేహం చిరకాలం నిలవాలి” అని అన్నారు. అనంతరం తాను హిందీ సరిగా మాట్లాడానో లేదో అంటూ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు.
అలాగే మోదీ పర్యటనకు ధన్యవాదాలు తెలుపుతూ, “మీ సందర్శనకు ధన్యవాదాలు. మన స్నేహానికి ధన్యవాదాలు. ఇది ఎంతో ఫలవంతమైన పర్యటన. ఫ్రాన్స్ మిమ్మల్ని ప్రేమిస్తుంది. వచ్చే ఫిబ్రవరిలో మళ్లీ కలుసుకోవాలని ఎదురుచూస్తున్నాం. జై హింద్” అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ జూన్ 13న మధ్యధరా సముద్ర తీర నగరమైన నీస్ కు చేరుకుని, మాక్రోన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.
మాక్రోన్ హిందీలో సందేశం ఇవ్వడం, “ఫ్రాన్స్ మిమ్మల్ని ప్రేమిస్తుంది” అని పేర్కొనడం రెండు దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి ప్రతీకగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాలు ఇటీవలి కాలంలో రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, సాంకేతిక రంగాల్లో మరింత బలపడుతున్న నేపథ్యంలో ఈ సందేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
