తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించే సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన చీఫ్ సెక్రటరీలు (సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు కీలక బాధ్యతలు అప్పగించడం రాష్ట్ర రాజకీయ-పరిపాలనా వ్యవస్థలో ఒక ఆనవాయితీగా మారింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రిటైర్డ్ సీస్లను, డీజీపీలను ప్రభుత్వం తమపక్కన పెట్టుకునేందుకు ప్రభుత్వ సలహాదారులగా నియమించకుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత వారిని పక్కన పెట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా బీఆర్ఎస్ సర్కార్ ఆయవాయితీని కొనసాగిస్తోంది.
తాజాగా పదవీ విరమణ చేయనున్న ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా, ఎక్స్-ఆఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్లకు పెద్దపీట వేశారు. పరిపాలనా అనుభవాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పలువురు మాజీ సీఎస్లు, డీజీపీలను ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు.
అప్పట్లో ప్రధానంగామాజీ సీఎస్ రాజీవ్ శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. అలాగే మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు (క్యాబినెట్ హోదా) కల్పించారు. మాజీ డీజీపీ అనురాగ్ శర్మను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ తో పాటు పులువురికి ప్రభుత్వ కూడా సలహాదారు బాధ్యతలు అప్పగించారు.
అయితే రెండున్నరేళ్ల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
రిటైర్డ్ డీజీపీ మహేందర్రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యలు అప్పగించింది. ఆయన కాలపరిమితి ఏడాది పాటు సాగింది. అనంతరం ఆయన పదవి నుంచి దిగిపోయారు. అలాగే బి. శివధర్ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించింది.
మాజీ సీఎస్ శాంతికుమారికి ఎంసీహెచ్ఆర్డీకి వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్ జనరల్గా నియమించారు. తాజాగా ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న సీఎస్ కె. రామకృష్ణారావును సీఎం సలహాదారుగా నియమించింది. దీంతో “మారింది ప్రభుత్వం మాత్రమే.. విధానం మాత్రం మారలేదు” అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఎందుకు రిటైర్డ్ అధికారులకే ప్రాధాన్యత?
పరిపాలనా వర్గాల అభిప్రాయం ప్రకారం ఇందుకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలపై సుదీర్ఘ అనుభవం.కేంద్ర-రాష్ట్ర సమన్వయంలో నైపుణ్యం. శాఖల మధ్య సమన్వయం చేయగల సామర్థ్యం. ముఖ్యమంత్రికి నేరుగా విధానపరమైన సలహాలు ఇవ్వగల అనుభవం. కీలక ప్రాజెక్టుల అమలులో కొనసాగింపు వంటి వాటిని సునాయాసంగా చేయగలరనే అంశాన్ని తీసుకుని పదవులు ఇస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. పాలకపార్టీ మాత్రం దీనిని పూర్తిగా పరిపాలన అవసరంగా సమర్థిస్తోంది.
ముఖ్యంగా భారీ పెట్టుబడులు, కేంద్రంతో సమన్వయం, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలులో అనుభవజ్ఞులైన మాజీ అధికారులు ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తోంది.
పదవీ విరమణ తర్వాత “రిహాబిలిటేషన్ పోస్టులు”గా మారుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సేవలో ఉన్న అధికారుల నిర్ణయ స్వాతంత్ర్యంపై ప్రభావం పడుతుందని కొందరు మాజీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నిపుణుల కంటే పదవీ విరమణ చేసిన అధికారులకే ప్రాధాన్యం ఇవ్వడం సరైందా అనే ప్రశ్న కూడా తరచూ వస్తున్నా పాలకపక్షాలు పెద్దగా పట్టించుకోకుండా నియామకాలు యధాతథంగా చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం “సలహాదారుల వ్యవస్థ”కు స్పష్టమైన విధానం, బాధ్యతలు, పనితీరు ప్రమాణాలు ఉండాలని, లేకపోతే ఇది రాజకీయ నియామకాల వేదికగా మారుతుందని విమర్శిస్తున్నాయి.
