రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు సారూ నన్ను బ్రతికించండి. నా లివర్ పాడయ్యింది …. మీరు సాయం చేస్తే నేను బతుకుతా. నేను బతికితే, బడికి పోయి బాగా చదువుకుంటా …. అంటూ చిన్నారి కీర్తన, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించింది.
వివరాలలోకి వెళితే, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పల్లపాటి వీరయ్య, మరియకుమారి దంపతులు, వారి కుమార్తె కీర్తనకు లివర్ పాడయ్యిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.
అనంతరం కీర్తన తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ కీర్తనకు చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని పలు హాస్పిటల్స్ తిరిగి రూ. 4 లక్షల వరకు ఖర్చు చేశామన్నారు. ఇంతకుమించి ఆర్ధిక స్తోమత తనకు లేదని చెప్పారు. కొంతమంది వైద్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్ళమని తమను ప్రిఫర్ చేశారని, ఖర్చు సుమారు 20 లక్షల వరకు అవుతుందని తెలిపారు.
అంత డబ్బు తన వద్ద లేదని ప్రభుత్వం గానీ, దాతలు గాని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు, దాతలు సహాయం చేయాలని అర్ధించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి కీర్తన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించుకున్న తీరు కలెక్టరేట్ లోని అధికారులకు, అక్కడ ఉన్న వారికి ఎంతగానో కలచివేసింది.
