ప్రపంచంహోమ్

బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులపై పాక్ ప్రతీకారం

#Balochistan

బెలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారిని పాకిస్తాన్ బలగాలు కాల్చి చంపుతూనే ఉన్నాయి. తాజాగా మరో తొమ్మిది మంది హతమయ్యారు. దీంతో జూలై 5 నుంచి ఇప్పటివరకు వివిధ ఆపరేషన్లలో మృతిచెందిన వారి సంఖ్య 88కు చేరింది.

పాకిస్థాన్ సైన్యం, ఫ్రంటియర్ కార్ప్స్, పోలీసులు కలిసి బలూచిస్తాన్‌లోని తిరుగుబాటు దారుల స్థావరాలపై గగనతల, భూతల దాడులను సమన్వయంతో కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. “ఆపరేషన్ షబాన్” పేరుతో జరుగుతున్న ఈ చర్యల్లో ఇప్పటివరకు 52 మంది హతమయ్యారని, జూలై 5 నుంచి నిర్వహించిన గూఢచారి సమాచారం ఆధారిత ఇతర ఆపరేషన్లను కలుపుకుంటే మొత్తం 88 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు పేర్కొన్నారు. చివరి తిరుగుబాటుదారుడు నిర్మూలించబడే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి.

క్వెట్టా జిల్లాలోని షబాన్ ప్రాంతంలో జూలై 5 నుంచి ఈ సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. మంగి డ్యామ్ పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్న పోలీస్ పోస్టుపై జరిగిన దాడిలో 27 మంది పోలీసు సిబ్బంది మరణించిన ఘటనకు బాధ్యులైన తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

దాడి సమయంలో తిరుగుబాటుదారులు ఇద్దరు స్టేషన్ హౌస్ అధికారులతో పాటు మొత్తం తొమ్మిది మంది పోలీసులను హతమార్చారు. అనంతరం మరో 18 మంది పోలీసులను తుపాకీ బెదిరింపులతో అపహరించారు. తర్వాత వారిని కూడా హత్య చేసి, వారి మృతదేహాలను జర్‌ఘూన్ గార్ పర్వత ప్రాంతంలో పడేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఖుజ్దార్ జిల్లాలోని జెడి ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్‌పై తిరుగుబాటుదారులు దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ భద్రతా బలగాలు ఆ యత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టినట్లు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. బలూచిస్తాన్‌లో ప్రభుత్వాధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని, తిరుగుబాటుదారులు తమ గమ్యాన్ని తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.

ఇటీవల బలూచిస్తాన్‌లో వరుసగా తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో వారిని పూర్తిగా నిర్మూలించేందుకు పౌర, సైనిక నాయకత్వం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. క్వెట్టాలో జరిగిన నేషనల్ యాక్షన్ ప్లాన్ ప్రావిన్షియల్ అపెక్స్ కమిటీ సమావేశంలో రక్షణ దళాల ప్రధానాధికారి, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ సమక్షంలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని సమిష్టిగా అంతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం, సైన్యం కలిసి ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

Related posts

పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్

Satyam News

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News

ఎన్ని విమర్శలు వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు

Satyam News

తెలంగాణ గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం

Satyam News

గోవా గవర్నర్ విజయనగరం రాక

Satyam News

వేగంగా పల్నాడు ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’

Satyam News

Leave a Comment