ఏపీని ఏవియేషన్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ టార్గెట్ చేరుకొనే దిశగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారు. భోగాపురంలో ఏవియేషన్ ఎడ్యూసిటీ.. కుప్పంలో పైలెంట్ ట్రైనింగ్ సెంటర్.. అనంతపురంలో ఎయిర్ ట్యాక్సీలు.. ఇలా రాష్ట్రం నలుమూలలా.. విమానయాన రంగంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
అమెరికా పర్యటనలో వచ్చిన ఒక ఆలోచన కార్యరూప దాల్చిందని.. ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు మంత్రి లోకేశ్. ఆ ఆలోచన ఏంటంటే.. చార్టెడ్ ఫ్లయిట్లు అద్దెకిచ్చే కంపెనీ. ఇలాంటి సంస్థ ఒకటి ఏర్పాటైతే.. దేశంలో వైమానిక అవసరాలకు ఉపయోగపడుతుందని ఆలోచించారు.
కెప్టెన్ తోటకూర ప్రసాద్ ఆ ఐడియాని ఆచరణలో పెట్టారు. చార్లీ ఫాక్స్ట్రాట్ అనే కంపెనీ ఏర్పాటు చేసి సుమారు 200 డెస్టినేషన్లకు ఛార్టెడ్ ఫ్లయిట్ సర్వీసులను అందిస్తున్నారు. భారత్ ఏఐ సమ్మిట్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేశ్.. అక్కడ చార్లీ ఫాక్స్ట్రాట్ కంపెనీ సేవలను ప్రారంభించారు. ఆ సంస్థలోని యువ పైలెట్లతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్లో పాల్గొని.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. భారత ఏవియేషన్ రంగానికి ఇలాంటి సంస్థలే ఫ్యూచర్గా మారతాయని చెప్పారు.
మన దేశంలో వైమానిక రంగం వేగంగా విస్తరిస్తోంది. విమానయాన సంస్థలు రానున్న ఐదేళ్లలో సుమారు 1500 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. పెద్ద సంఖ్యలో కొత్త ఎయిర్పోర్టులు వస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఏడు ఎయిర్పోర్టులు ఉండగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం దాదాపు పూర్తయింది. జూన్, జూలై నెల్లో పూర్తి స్థాయిలో విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా దగదర్తిలో మరో ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆమోదం లభించింది. శ్రీకాకుళం, కుప్పం, దొనకొండ, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాల్లోనూ ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే సమయంలో భోగాపురం ఎయిర్పోర్టుకి అనుబంధంగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ద్వారా.. వైమానిక రంగంలో పని చేసే పైలెట్లు.. ఫ్లయిట్ మెయింటెనెన్స్ క్రూ వంటి సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటితో రానున్న మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఏవియేషన్ హబ్గా మారనుంది.
