ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్ ను అధిగమించవచ్చని విజయనగరం జిల్లా ఏఎస్పీ సౌమ్యలత అన్నారు. అంతర్జాతీయ మహిళా సాధికారత వారోత్సవాల్లో సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో మహిళా ఉద్యోగులకు ఉచిత కేన్సర్ స్క్రీనింగు, గైనిక్ , సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించింది.
మహేంద్ర ఆసుపత్రి , మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రి , రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సౌజన్యంతో మహిళ పోలీసు సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలను పోలీస్ శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ముఖ్య అతిధిగా హాజరై, స్క్రీనింగు పరీక్షలను ప్రారంభించారు.
అనంతరం అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలు ఎక్కువగా కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మహిళ సిబ్బంది అంతా తమ,తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. సర్వైకల్, చాతీ కేన్సర్ పరీక్షలను సకాలంలో చేయించు కొంటే సులభంగా ఆ వ్యాధిని జయించవచ్చునన్నారు.
ఈ కేన్సర్ స్క్రీనింగు పరీక్షలు చేయించుకొనేందుకు ఎటువంటి సిగ్గు పడాల్సిన అవసరం లేదని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని, ప్రాధమిక స్థాయిలో కేన్సర్ మరియు తీవ్ర వ్యాధులకు వైద్యం పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో మహేంద్ర హాస్పిటల్ డాక్టర్ డా.మహేంద్ర గిరి బెవర మాట్లాడుతూ కుటుంబానికి మహిళలే కీలకమని మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే ఆ భారం కుటుంబంపై పడుతుందన్నారు.
ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే తమ హాస్పిటల్ డాక్టర్లను సంప్రదించాలన్నారు. మహేంద్ర హాస్పిటల్ గైనకాలిజిస్టు డా.బి.ప్రశాంతి, మహాత్మా గాంధీ కేన్సర్ ఆసుపత్రి డా.యామినిలు కేన్సర్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా పోలీసు సిబ్బందికి వివరించి, అవగాహన కల్పించి, స్క్రీనింగు పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, మహిళా పిఎస్ ఇన్స్పెక్టరు ఈ.నర్సింహమూర్తి, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, డిటిసి సిఐ బి.లలిత, ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, మహాత్మా గాంధీ ఆసుపత్రి మార్కెటింగు మేనేజరు వీరబాబు, క్యాంపు కో- ఆర్డినేటరు స్వాతి, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది, ఎంఎస్పీలు పోలీసు కుటుంబ మహిళలు పాల్గొన్నారు.
