ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు , విభజన హామీలపై చర్చించనున్నారు.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, రైల్వే జోన్, వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలను ఆయా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.ఇక, ఈ పర్యటనలో అత్యంత కీలకమైంది చంద్రబాబు – అమిత్ షా సమావేశం. ఈ సమావేశంలో నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల అంశమే కాకుండా ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి.
ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కల్తీ లడ్డూ, లిక్కర్ స్కామ్ అంశాల విచారణపైనా చర్చిస్తారని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత ఏపీలో కీలకమైన రాజకీయ పరిణామాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదల, రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులపై చర్చించనున్నారు. దీంతో పాటు జల్ శక్తి, రైల్వే శాఖ, వ్యవశాయ శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తిరిగి సాయంత్రం అమరావతికి చేరుకోనున్నారు చంద్రబాబు.
ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అమిత్ షాతో భేటీతో వైసీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి వివాదం, సిట్ విచారణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫ్యాన్ పార్టీ నేతలు చంద్రబాబు ఢిల్లీ టూర్తో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
