ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసం వద్ద ఈ అరెస్ట్ జరిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) అయిన అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
జనార్దనరావు తమ విచారణలో, మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లుగా పేర్కొన్నారు. దీని ఆధారంగా, సిట్ బృందం ఆదివారం తెల్లవారుజామునే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి చేరుకుంది. పోలీసులు మొదట జోగి రమేష్కు సెర్చ్ వారెంట్ నోటీసులు జారీ చేసి, ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం జోగి రమేష్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
అనంతరం వారిని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. అరెస్ట్కు ముందు జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇంటికి రాగానే కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది.
కొంతసేపు జోగి రమేష్ ఇంటి తలుపులు తెరవకపోవడంతో హైడ్రామా కొనసాగింది. పోలీసులు నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో కార్యకర్తలు పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ గతంలోనే స్పష్టం చేసి, సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ మంగళవారం జరగాల్సి ఉంది.
