ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పదవీచ్యుతుడిని చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చను రేపింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడంతో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో చద్ధా పార్టీ నాయకత్వానికి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. “నా నిశ్శబ్దాన్ని ఓటమిగా భావించవద్దు. సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతాను” అంటూ వీడియో సందేశం విడుదల చేశారు. పంజాబ్లో AAP ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండు సంవత్సరాల్లో చద్ధా కీలక పాత్ర పోషించారు. ఆయనను పార్టీకి సమాంతర శక్తికేంద్రంగా కూడా భావించారు. అయితే తాజాగా ఆయన స్థానంలో అశోక్ కుమార్ మిట్టల్ ను డిప్యూటీ లీడర్గా నియమించారు.
పార్లమెంట్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పార్టీ రాజ్యసభ కార్యాలయానికి సూచనలు ఇచ్చిందని చద్ధా ఆరోపించారు. సాధారణ ప్రజలకు సంబంధించిన అంశాలను, ఎయిర్పోర్టుల్లో అధిక ధరలు, గిగ్ వర్కర్ల సమస్యలు, కల్తీ ఆహారం, బ్యాంకుల హిడెన్ ఛార్జీలు ప్రస్తావించడం తప్పా? అని ప్రశ్నించారు. AAPలో చద్ధాపై అసంతృప్తి పెరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఆయనకు బీజేపీతో సమీప సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాబోయే పంజాబ్ ఎన్నికలలో కేంద్రంలోని పార్టీ ఆయనను ఉపయోగించుకునే అవకాశంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2022 పంజాబ్ ఎన్నికల్లో AAP విజయంలో చద్ధా కీలక పాత్ర పోషించినట్లు భావిస్తారు. ఆ ఎన్నికల్లో పార్టీ 117 స్థానాల్లో 92 స్థానాలు గెలుచుకుంది.
అయితే 2023 చివరి వరకు ప్రభావం చూపిన చద్ధా, తరువాత రాజకీయంగా కొంత వెనుకబడ్డారు. డిల్లీ లిక్కర్ స్కాం కేసులో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సమయంలో చద్ధా గైర్హాజరు కావడం పార్టీ నాయకత్వానికి నచ్చలేదని సమాచారం. ఆయన కంటి చికిత్స కోసం యూకే వెళ్లినట్లు అప్పట్లో చెప్పారు. తిరిగి భారత్కు వచ్చినప్పటికీ పార్టీ నమ్మకం కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు చండీగఢ్లోని సెక్టార్-2లో ఉన్న హౌస్ నంబర్ 50లో కీలక నాయకులు, అధికారులు ఆయనను కలవడానికి క్యూలు కట్టేవారు. అయితే గత ఏడాది ఆ ఇంటిని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలు AAPలో చద్ధా భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి.
