భారత్ పై పాకిస్తాన్ కుట్రలు మానడం లేదు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక దేవాలయం, ఢిల్లీ-సోనేపట్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ ఢాబా, అలాగే హర్యానాలోని సైనిక శిబిరంపై దాడులకు కుట్ర పన్నినట్లు సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది.
షెహ్జాద్ భట్టి మాడ్యూల్కు చెందిన కార్యకర్తల ద్వారా ఈ దాడులను అమలు చేయాలని యోచించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిర్వహించిన “గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0”లో భాగంగా పలు రాష్ట్రాల్లో తొమ్మిది మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. వీరిని విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయని భద్రతా వర్గాలు తెలిపాయి.
దర్యాప్తులో భాగంగా ఒక నిందితుడు ఢిల్లీలోని చారిత్రక దేవాలయాన్ని ముందుగా పరిశీలించి, అక్కడి ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్థాన్లో ఉన్న నిర్వాహకులకు పంపినట్లు గుర్తించారు. దేవాలయం వద్ద భద్రత కోసం విధుల్లో ఉన్న పోలీసులు, అర్ధసైనిక దళాలపై కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించాలని కుట్ర పన్నినట్లు సమాచారం.
అదేవిధంగా ఢిల్లీ-సోనేపట్ రహదారిపై ప్రతిరోజూ వేలాది మంది సందర్శించే ప్రముఖ ఢాబాపై గ్రెనేడ్ దాడి చేయాలని కూడా ప్రణాళిక రచించినట్లు అధికారులు వెల్లడించారు. భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగించడం ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.
హర్యానాలోని హిసార్ ప్రాంతంలోని ఒక సైనిక శిబిరాన్ని కూడా నిందితులు గమనించి, అక్కడి వీడియోలను సరిహద్దు ఆవల ఉన్న నిర్వాహకులకు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్లోని కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా లక్ష్యాల జాబితాలో ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో విచారిస్తున్న భద్రతా సంస్థలు, దేశవ్యాప్తంగా మరిన్ని అనుమానితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా మారే కుట్రలను ముందుగానే భగ్నం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
