కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కోమరవోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం దత్తత ఆలయమైన శ్రీ అమర లింగేశ్వర దుర్గా నాగేశ్వరస్వామి వారి వార్షిక కళ్యాణం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకను నిర్వహించారు. ఆదివారం ఉదయం నిత్యోపాసన, బలిహరణ కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
సాయంత్రం జగజ్యోతి వెలిగించిన అనంతరం, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వికె శీనా నాయక్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
భక్తుల జయజయధ్వానాల మధ్య, మంగళ వాయిద్యాల వేదికగా స్వామివారు, అమ్మవార్ల కళ్యాణాన్ని అర్చక బృందం కమనీయంగా జరిపించారు.
ఈ వేడుకలో గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి. రమాదేవి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
