అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన మమతా బెనర్జీకి ఇప్పుడు సొంత పార్టీలోనే తిరుగుబాటు ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ సంచలన ప్రకటన చేస్తూ, శాసనసభలో ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) పదవిపై తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు.
రెండు రోజుల క్రితం పార్టీ నుంచి బహిష్కరించబడిన రితబ్రత బెనర్జీ, ఎల్ఓపీగా ఎంపికైన ఛటోపాధ్యాయకు మద్దతుగా పంపిన లేఖలో తన సంతకం నకిలీదని ఆరోపించారు. తాజాగా ఆయన తనకు 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతూ మద్దతు లేఖలను మీడియాకు చూపించారు.
రితబ్రత బెనర్జీతో పాటు ఎమ్మెల్యేలు అరుణ్ రాయ్, షయులీషా తదితరులు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి చేరుకున్నారు. తాము సమావేశమై కొత్త ప్రతిపక్ష నేతను ఎన్నుకుంటామని ఆయన తెలిపారు.
ఈ వివాదం టీఎంసీలో తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, సోభాందేబ్ చటోపాధ్యాయ్ పేరును ప్రతిపక్ష నేత పదవికి ప్రతిపాదించగా, రితబ్రత బెనర్జీతో పాటు ఎమ్మెల్యే సందీపన్ షా తమ సంతకాలు ఫోర్జరీ చేయబడ్డాయని ఆరోపించారు. ఈ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందూ అధికారి ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.
టీఎంసీ శాసనసభ పక్షంలో మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ నుంచి విడిపోయి ప్రత్యేక శాసనసభ పక్షంగా గుర్తింపు పొందాలంటే కనీసం మూడింట రెండొంతుల మద్దతు అవసరం. అంటే కనీసం 53 మంది ఎమ్మెల్యేలు విడిపోతేనే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ప్రత్యేక వర్గంగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది.
రితబ్రత బెనర్జీ పేర్కొన్న 59 మంది ఎమ్మెల్యేల మద్దతు వాస్తవమైతే, అది టీఎంసీకి పెద్ద రాజకీయ సవాలుగా మారే అవకాశం ఉంది. అయితే ఈ సంఖ్యపై ఇప్పటివరకు పార్టీ అధికారికంగా స్పందించలేదు. దీంతో బెంగాల్ రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
