పెట్రోలు ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే ప్రతిపాదన ఇప్పటిలో లేదని కేంద్రం ప్రకటించింది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం కంటే పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పెట్రోలియం, సహజ వాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ పరిమితిని పెంచాలంటే విస్తృత శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహించి, వాహన తయారీ సంస్థలు, చమురు మార్కెటింగ్ సంస్థలు, పరిశోధనా సంస్థలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
దేశం 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని నిర్ణయించిన గడువు కంటే ఐదేళ్ల ముందుగానే సాధించిందని మంత్రి వెల్లడించారు. 2013-14లో సగటు ఇథనాల్ మిశ్రమం కేవలం 1.53 శాతం ఉండగా, 2025-26 సరఫరా సంవత్సరంలో అది 20 శాతానికి చేరిందని చెప్పారు.
2014-15 నుంచి ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ద్వారా దేశానికి సుమారు రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్య ఆదా జరిగిందని, దాదాపు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని, 952 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు నివారించబడినట్లు తెలిపారు. రైతులకు అదనంగా రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించిందని పేర్కొన్నారు.
ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల ఇంజిన్ దెబ్బతినడం, ఇంధన పంపు సమస్యలు, తుప్పు పట్టడం లేదా నీటి కాలుష్యం వంటి అంశాలపై వాహన తయారీ సంస్థలు, వాహన సంఘాలు లేదా వినియోగదారుల నుంచి విస్తృతంగా నిర్ధారిత ఫిర్యాదులు ఏవీ ప్రభుత్వానికి అందలేదని మంత్రి చెప్పారు. సామాజిక మాధ్యమాలు, వార్తా కథనాల్లో వచ్చిన ఆందోళనలను మాత్రం శాస్త్రీయంగా పరిశీలించినట్లు వెల్లడించారు.
ఇప్పటికే 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు, వాటిలో ఇథనాల్ 20 శాతం ప్రమాణానికి అనుగుణంగా తయారు కాని పాత వాహనాలు కూడా, రెండున్నర నుంచి మూడున్నర సంవత్సరాలుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ఇంజిన్ వైఫల్యాలు నమోదుకాలేదని తెలిపారు. ప్రముఖ నాలుగు చక్రాల వాహన తయారీ సంస్థ 2.84 కోట్ల వాహనాల సేవా వివరాలను పరిశీలించినా ఇథనాల్ వల్ల నష్టం జరిగిన ఆధారాలు లభించలేదని, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించిందని చెప్పారు.
ఇథనాల్ 10 శాతం మిశ్రమానికి అనుగుణంగా రూపొందించిన పాత వాహనాల్లో ఇంధన సామర్థ్యం సుమారు 3 నుంచి 5 శాతం వరకు మాత్రమే స్వల్పంగా తగ్గవచ్చని, అయితే ఇథనాల్ 20 శాతం మిశ్రమం అధిక ఆక్టేన్ విలువ, మెరుగైన దహన ప్రక్రియ కారణంగా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించిన వాహనాలపై తయారీ సంస్థలు వారంటీలను కొనసాగిస్తున్నాయని తెలిపారు.
ఆహార భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ ఆహార భద్రత చట్టం, నిల్వ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ధాన్యాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వినియోగిస్తున్నట్లు చెప్పారు. 2025-26లో జూన్ 30 వరకు ఇథనాల్ తయారీ కోసం 39.28 లక్షల టన్నుల బియ్యం, 67.87 లక్షల టన్నుల మొక్కజొన్న వినియోగించారని వెల్లడించారు.
చెరకు ఆధారిత ఇథనాల్పై ఆధారపడకుండా మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ ముడి పదార్థాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. 2021-22లో శూన్యంగా ఉన్న మొక్కజొన్న వాటా 2025-26లో సుమారు 37 శాతానికి పెరిగిందని చెప్పారు. ప్రతి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి సాధారణంగా 3 నుంచి 5 లీటర్ల శుద్ధి చేసిన నీటిని ఉపయోగిస్తారని, అన్ని డిస్టిలరీలు ద్రవ వ్యర్థాలు బయటకు విడుదల చేయకుండా నిర్వహించాల్సిన నిబంధనలు అమల్లో ఉన్నాయని వివరించారు.
ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు 2025-26లో జూన్ వరకు 705.43 కోట్ల లీటర్ల ఇథనాల్ను రూ.49,577 కోట్ల విలువతో కొనుగోలు చేశాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 501 ఇథనాల్ సరఫరాదారులు ఈ సంస్థల వద్ద నమోదై ఉన్నారని చెప్పారు.
ఎంచుకున్న పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ కలపని లేదా తక్కువ మిశ్రమం ఉన్న పెట్రోల్ను అందుబాటులో ఉంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి రెండు వేర్వేరు సరఫరా వ్యవస్థలను నిర్వహించడం వల్ల వ్యయభారం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యాలు దెబ్బతింటాయని పేర్కొంది. జాతీయ జీవ ఇంధన విధానం ప్రకారం పరిశుభ్రమైన, పర్యావరణహిత ఇంధనాల వైపు క్రమంగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు.
