రెండు మూడు దశాబ్దాల క్రితం ఆంధ్రజ్యోతి, యువ, చందమామ వంటి పత్రికాసంస్థలు ప్రముఖ చిత్రకారుల ముఖచిత్రాలతో ఇలాంటి ప్రత్యేక సంచికలు వెలువరించేవని, నవమల్లెతీగ 100వ సంచిక చూస్తుంటే ఆనాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. గురువారం అమరావతి-సచివాలయంలోని మంత్రి పేషీలో నవమల్లెతీగ 100వ సంచికను మంత్రి సవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- ప్రింట్ పత్రికలు కనుమరుగవుతున్న నేటి కాలంలో ప్రత్యేక సంచికను తీసుకురావడం గొప్ప సాహసమన్నారు. సాహిత్యాన్ని ప్రధానంగా చేసుకుని సాహితీవేత్తలతో పాటు యువతను, మహిళలను అన్నిరకాల పాఠకుల్ని ఆకట్టుకునే విధంగా పత్రికను రూపొందిస్తున్న సీనియర్ సంపాదకులు కలిమిశ్రీ, ఆయనకు సహకరిస్తున్న ఎడిటోరియల్ బోర్డు సభ్యులు అభినందనీయులు అన్నారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, రాజధాని వార్తలు సంపాదకులు పఠాన్ హుస్సేన్ ఖాన్, సీనియర్ జర్నలిస్టులు చొప్పా రాఘవేంద్రశేఖర్, వై. డి. ఆనంద్ పాల్గొన్నారు.
