జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని చిలుకూరి శ్రీరామమూర్తి ఆసుపత్రిలో ప్రత్యేక పోలియో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన శిబిరాన్ని సందర్శించి, చిన్నారులు కోలా గీతాన్ష్, కోలా హేమచంద్రలకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, అందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని కొనియాడారు. “ఈ రోజు వేసే చిన్న చుక్క, రేపటి పోలియో-రహిత భవిష్యత్తుకు పెద్ద భరోసా” అనే విషయాన్ని తల్లిదండ్రులంతా గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు.
5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఎలాంటి వాయిదాలు వేయకుండా, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు సచివాలయం సిబ్బంది కొప్పిశెట్టి నాగలక్ష్మి, సి.హెచ్. మరియ కుమారి తదితరులు పాల్గొని చిన్నారులకు చుక్కల మందు వేశారు.
