వరంగల్ జిల్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులపై వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శ్రీచైతన్యలో పని చేస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం.
ఉపాధ్యాయులకు బోధనతో పాటు అడ్మిషన్ల బాధ్యతలు కూడా అప్పగిస్తూ, ప్రతి ఒక్కరు కనీసం 10 అడ్మిషన్లు తీసుకురావాలని స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోకపోతే ఉద్యోగాలపై ప్రభావం చూపుతామని ప్రిన్సిపాల్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
అడ్మిషన్ల కోసం టీచర్లను కాలనీలు, బస్తీలు, పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రచారం చేయాల్సిందిగా బలవంతం చేస్తున్నారని సమాచారం. లక్ష్యాన్ని చేరుకోలేకపోతే జీతాల్లో కోతలు విధించడం లేదా ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్కూల్లోనే ఉంచుతూ ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ సమస్యలు కూకట్ పల్లి, కరీంనగర్, వరంగల్ లోని కాశీబుగ్గ బ్రాంచ్లలో ఎక్కువగా ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అనేక పట్టణాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొనసాగుతోందని వారు అంటున్నారు.
అదనంగా, వారంలో ఒకరోజు కూడా సెలవు ఇవ్వకుండా ఆదివారాల్లో కూడా పని చేయాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమపై జరుగుతున్న వేధింపులను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
