రాష్ట్రంలో 49 డిగ్రీల ఉష్టోగ్రతలు వరకు నమోదవుతున్న నేపథ్యంలో, విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్ మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ ఫార్మార్లు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, కేవలం పలు సాంకేతిక కారణాలతోనే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి స్పష్టం చేశారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని వివరించారు.
మూడు డిస్కంల పరిధిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లలో సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు. సమస్యల త్వరిత పరిష్కారం కోసం కాల్ సెంటర్లలో ఇప్పటికే అదనపు సిబ్బందిని నియమించామన్నారు. ఈదురు గాలులు, వానల వలన స్తంభాలు పడిపోయి, చాలా ప్రాంతాల్లో కండక్టర్లు కట్ అవుతున్నాయన్నారు. దీనితో కూడా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయన్నారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రనకా, పగలనకా కష్టపడుతున్నారని చెప్పారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం కొన్ని సార్లు చుట్టు పక్కల ప్రాంతాలలోనూ కొంత సమయం సరఫరాను ఆపి పనులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. సత్తెనపల్లిలో ట్రాన్స్ ఫార్మర్ల మరమత్తులు సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ప్రజలు కూడా విద్యుత్ పునరుద్ధరణ చర్యలను అర్థం చేసుకుని ఓర్పుగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
వైసీపీ పాలనలో ఒక్క సబ్ స్టేషన్ ను నిర్మించలేదు….
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క సబ్ స్టేషన్ ను కూడా నిర్మించలేదని ఇంధన మంత్రి గొట్టిపాటి విమర్శించారు. దీనితో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.6 వేల కోట్లతో ట్రాన్స్ కో సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సుమారు 30 సబ్ స్టేషన్లు అక్టోబర్ నాటికి పూర్తవుతాయన్నారు. జిల్లాల వారీగా అవసరరాన్ని బట్టి ట్రాన్స్ ఫార్మార్లను అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. అప్ గ్రేడేషన్ తో పాటు సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు ఉండవన్నారు.
పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఏలూరు, విజయవాడ ఎయిర్ పోర్ట్ వంటి ప్రాంతాల్లో అనుకున్న సమయానికి ముందే సబ్ స్టేషన్ నిర్మించి వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు.
అనుమతులులేని హోర్డింగ్ లను తొలగిస్తాం….
అనుమతులు లేని హోర్డింగ్ లు, ఫ్లెక్సీల వలన విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. గాలి, వానల వలన హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఊడి విద్యుత్ లైన్లపై పడుతున్నాయన్నారు. దీనితో లైన్లు తెగిపోయి, కండక్టర్లు ఊడిపోతున్నాయన్నారు. దీనితో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.
ఈ విషయాలను మున్సిపల్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి అనుమతులు లేని హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు తొలగించేందుకు చర్యలు చేపడతామన్నారు. తాజాగా విజయవాడలో ఇదే విధంగా హోర్డింగ్ లు విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, దానిని పునరుద్ధరించడానికి సుమారు నాలుగు గంటలకుపైగా సమయం పట్టిందన్నారు.
శ్రీకాకుళం, నంద్యాల, కర్నూలు, వంటి ప్రాంతాల్లోనూ ఇదే విధంగా విద్యుత్ స్తంభాలు కూలి, కండక్టర్లు కట్ అయిపోయాయన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ శాఖపై ఎటువంటి దృష్టి పెట్టలేదన్నారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖను దేశానికే రోల్ మోడల్ గా చేస్తున్నారని ప్రశంసించారు. ఒకవైపు ఇటువంటి పనులు చేస్తూనే మరోవైపు ఆర్డీఎస్ఎస్, విద్యుత్ శాఖ అభివృద్ది పనులు కూడా వేగంగా చేపడుతున్నామని స్పష్టం చేశారు.
