కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ డీ సతీషన్ ను అధిష్టానం ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించిన దాదాపు పది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది.
మే 4న వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం కేరళ కాంగ్రెస్లో సీఎం పదవిపై తీవ్ర అంతర్గత చర్చలు, లాబీయింగ్ కొనసాగింది. గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం వరుస సమావేశాలు నిర్వహించి చివరకు సతీశన్ పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించింది.
సీనియర్ కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, కేరళ ఇన్చార్జ్ దీపా దాస్మున్షి సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీపా దాస్మున్షి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ పరిశీలకులు విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం సతీశన్ పేరును ఖరారు చేసినట్లు తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా కేంద్ర పరిశీలకులుగా నియమితులైన అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ కేరళ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను కలిసి వారి అభిప్రాయాలను సేకరించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించారు.
ముఖ్యమంత్రి పదవికి సతీశన్తో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కె సి వేణుగోపాల్ కూడా ప్రధాన పోటీదారుడిగా నిలిచారు. వేణుగోపాల్కు పార్టీ నాయకత్వంలోని కొంతమంది నేతల మద్దతు ఉన్నప్పటికీ, 2029 లోక్సభ ఎన్నికల వ్యూహాల దృష్ట్యా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఆయనను ఢిల్లీ రాజకీయాల నుంచి రాష్ట్రానికి తరలించడం వల్ల కలిగే ప్రభావాలను కూడా కాంగ్రెస్ పరిశీలించినట్లు సమాచారం.
ఇక సీనియర్ నేత రమేష్ చెన్నితల పేరు కూడా చర్చల్లో వినిపించింది. వర్గపోరు మరింత ముదిరితే రాజీ అభ్యర్థిగా ఆయనను ఎంపిక చేసే అవకాశాన్ని పార్టీ అంతర్గతంగా పరిశీలించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.
