తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ చరిత్రను ప్రతిబింబించేలా ప్రత్యేక వీడియో ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన కీలక ఘట్టాలను ఈ వీడియోలో సమగ్రంగా ప్రదర్శించారు. ఎన్టీఆర్ చేపట్టిన రథయాత్ర నుంచి ఆయన, అలాగే చంద్రబాబు ప్రభుత్వాల్లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, విధాన నిర్ణయాలను వివరంగా చూపించారు.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా టీడీపీ చేపట్టిన పాలన, రాజకీయ విధానాలను కూడా వీడియోలో ప్రస్తావించారు. పార్టీ అభివృద్ధికి నారా లోకేష్ చేసిన కృషి, ఆయన చేపట్టిన పాదయాత్ర విశేషాలను ప్రత్యేకంగా చూపించారు. అలాగే 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలను ప్రతిబింబిస్తూ అరాచకాలు, దౌర్జన్యాలను వీడియో రూపంలో చూపించారు. చంద్రబాబు సహా పలువురు సీనియర్ నేతలపై నమోదైన కేసులు, జరిగిన అరెస్టులను కూడా ప్రస్తావించారు. లోకేష్ పాదయాత్రకు ఎదురైన అడ్డంకులు, వాటిని అధిగమించిన తీరు కూడా వీడియోలో ప్రతిఫలించింది.
రాజధాని రైతులు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, ఆర్యవైశ్యులపై జరిగిన దాడులు, నాటి ప్రభుత్వ విధానాల వల్ల ఎదురైన ఇబ్బందులను ఉదాహరణలతో వివరించారు. అలాగే వివేకా హత్య అంశాన్ని కూడా వీడియోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా, ఈసారి ఆవిర్భావ దినోత్సవ సభను కొత్త తరహాలో, ఫ్రెష్ లుక్తో నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, సీనియర్ నేతలు, యువ నాయకులకు పెద్దపీట వేశారు. సభా వేదికపై కార్యకర్తలను కూర్చోబెట్టి, సీనియర్ నేతలను సభికుల్లో కూర్చోబెట్టి కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నవారికి, గత ప్రభుత్వంలో వేధింపులకు గురైనవారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ కోసం విశేషంగా సేవలందించిన 19 మంది సామాన్య కార్యకర్తలను సభా వేదికపై కూర్చోబెట్టి గౌరవించారు.
ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను యువ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మకు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ కార్యకర్తలు పార్టీ కోసం తాము చేసిన సేవలను భావోద్వేగంతో వివరించారు. “కార్యకర్తే అధినేత” అనే నినాదాన్ని నిజంగా అమలు చేసే పార్టీ టీడీపీనే అని కార్యకర్తలు ప్రశంసించారు.
