వైసీపీ హయాంలో గ్రూప్-1 నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో, ఆ అధికారులందరినీ కీలక పోస్టుల నుంచి ప్రభుత్వం తొలగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లుగా పని చేస్తున్న వారిని లూప్ లైన్కు పంపేశారు. అర్హులైన అభ్యర్థుల నోరు కొట్టి, తమకు కావాల్సిన వారికి పోస్టులు కట్టబెట్టి జగన్ ప్రభుత్వం చేసిన కుట్ర మరోసారి హాట్ టాపిక్గా మారింది.
ఆన్సర్ షీట్స్ దిద్దుబాటులో వైసీపీ ప్రభుత్వం అప్పట్లో భారీ మాయాజాలం చేసింది. అర్హులను ఫెయిల్ చేసి, తమకు అనుకూలమైన వారిని పాస్ చేయించేందుకు పేపర్లను రెండు, మూడు సార్లు దిద్దించారనే విమర్శలు ఉన్నాయి. ఏకంగా డిజిటల్ మూల్యాంకనంలోనూ అక్రమాలకు పాల్పడి, నిరుద్యోగుల భవిష్యత్తుతో జగన్ సర్కార్ ఆడుకుంది. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే ఈ నియామక ప్రక్రియం సాగిందన్నది కాదనలేని నిజం.
ఈ అక్రమాలపై బాధితులు చేసిన న్యాయపోరాటంతో కూటమి ప్రభుత్వం వచ్చాక సిట్ విచారణ మొదలైంది. తప్పు చేసిన వారు అధికారంలో ఉంటే విచారణ సరిగ్గా జరగదని కోర్టు భావించడంతో, ఈ భారీ బదిలీలు జరిగాయి. వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు దక్కించుకున్నవారు ఎంతటి వారైనా సరే.. విచారణలో అసలు విషయాలు బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది.
కోట్లు కుమ్మరించి ఉద్యోగాలు కొన్నవారు ఎవరు.? వారి వెనుక ఉన్న వైసీపీ పెద్దలెవరు? అనే విషయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. నాడు అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ విచారణ పూర్తి అయితే వైసీపీ హయాంలో సాగిన మరో భారీ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
