తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, గోపాలపురం మండలం గోపవరం గ్రామానికి చెందిన నేకూరి ఎలీసా (70) అనే వ్యక్తి ఒక రైతు వద్ద పొగాకు బ్యారెన్ లో క్యూరింగ్ పనుల కోసం యాదవోలు గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో సాయంత్రం సమయంలో ఆడుకోవడానికి బ్యారెన్ వద్దకు వచ్చిన ఐదు సంవత్సరాల మైనర్ బాలికపై సదరు వృద్ధుడు కన్నేసి అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
బాలిక భయంతో గట్టిగా ఏడవడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధుడిని అడ్డుకున్నారు. నిందితుడి దారుణాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలైన మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
