అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక మైనర్ బాలిక దారుణ హత్యకు గురికావడం స్థానికంగా పెను ఉద్రిక్తతలకు దారితీసింది. బాలికను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితుడు కులవర్ధన్, మృతదేహాన్ని ఒక డ్రమ్ములో దాచి ఉంచడం సంచలనం సృష్టించింది.
ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహోద్వేగాలకు లోనైన స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తక్షణమే అతడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ కదిరి – మదనపల్లి జాతీయ రహదారిని గత ఆరు గంటలుగా దిగ్బంధించారు. దీంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఆగ్రహంతో ఉన్న స్థానికులు వారి మాటలను వినడానికి నిరాకరించారు.
నిందితుడి ఇంటి వైపు వెళ్లకుండా పోలీసులను అడ్డుకోవడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని స్థానికులు భీష్మించుకోవడంతో మదనపల్లిలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు.
