తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం మరియు వసతి గదుల బుకింగ్ పేరుతో భక్తులను మోసగిస్తున్న నకిలీ వెబ్సైట్లు, దళారుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
కేరళకు చెందిన సి.కె. సురేష్ బాబు అనే భక్తుడు “కర్ణాటక ప్రవాసీ సౌధ” పేరుతో గదులు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ విభాగం, గూగుల్ సెర్చ్లో టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టించి గుర్తుతెలియని వ్యక్తులు భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గుర్తించింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని, ఆలయ చిత్రాలను, టీటీడీ లోగోలను అక్రమంగా వాడుతూ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ వ్యవహారంపై స్పందించిన టీటీడీ ఐటీ విభాగం, సదరు నకిలీ వెబ్సైట్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాపీరైట్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు దర్శనం, వసతి లేదా సేవా టిక్కెట్ల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సంప్రదించాలని, గుర్తుతెలియని లింకులు, ఏజెంట్లు లేదా ప్రైవేట్ వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.
ఏదైనా అనుమానాస్పద వెబ్సైట్లు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని టీటీడీ స్పష్టం చేస్తూ, అధికారిక పోర్టల్ వెలుపల బుకింగ్ల కోసం ఏ ఇతర ప్రైవేట్ సంస్థలకు అనుమతి లేదని పునరుద్ఘాటించింది.
