ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం మారబోతోంది. యువతకు కొత్త భవిష్యత్తు ఆవిష్కృతం కాబోతోంది. ఏపీని దేశంలోనే నెంబర్ వన్గా నిలపాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం…ఆ దిశగా ఒక చారిత్రక అడుగు వేస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ (AMNS) కంపెనీలు సంయుక్తంగా నిర్మించనున్న భారీ స్టీల్ప్లాంట్కు సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ సైతం ట్వీట్ చేశారు. ఒక్క ప్రాజెక్టుతో లక్ష మందికి జీవనోపాధి, రేపటి నుంచి కొత్త భవిష్యత్తు ప్రారంభం కాబోతోందంటూ ఆ ట్వీట్లో చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో సరైన పరిశ్రమలు రాక, ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిన ఏపీ యువతకు..ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా ఏకంగా లక్ష మందికి పైగా ఉపాధి లభించనుంది.
రాష్ట్ర చరిత్రలోనే ఇది భారీ పెట్టుబడి. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఏకంగా రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నాయి. దీని ద్వారా MSMEలకు, అనుబంధ పరిశ్రమలకు ఊతం లభించడమే కాకుండా, స్థానికంగా రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో వేలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకురానున్నాయి.
ఈ కార్యక్రమం కోసం నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ శివారు పాటిమీద గ్రామం దగ్గర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ బహిరంగ సభ కోసం వేదికను ముస్తాబు చేశారు. ఈ చారిత్రక ఘట్టంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కుమార స్వామి, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు.
