వేలాది మంది రైతుల త్యాగం, లక్షలాది మంది ప్రజల ఆశల ప్రతిరూపం అమరావతి. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంలో సాగిన అమరావతి ఉద్యమం, నేడు ఒక చారిత్రక విజయ తీరానికి చేరుకుంది. 2026, మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానం.. ఆనాడు రోడ్లపై రక్తం చిందిన రైతులకు, అవమానాలు భరించిన ఆడబిడ్డలకు దక్కిన అసలైన గౌరవం గా చెప్పవచ్చు.
వై ఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుండి అమరావతి ఒక ఆవేదన నిలయంగా మారింది. రాజధాని కోసం భూములిచ్చిన 600 మందికి పైగా రైతులు ఒత్తిడి, ఆందోళనలతో గుండె ఆగి మరణించారు. వారి మరణాలకు నేడు అసెంబ్లీ సాక్షిగా ఒక చట్టబద్ధమైన గుర్తింపు లభించింది.
అమరావతిని తరలిస్తుంటే ఆడబిడ్డల ఆక్రందన, నిరసన తెలుపుతున్న మహిళలను సైతం చూడకుండా, పోలీసు బూట్లతో తన్నించిన దృశ్యాలు, లాఠీ దెబ్బలు, అక్రమ అట్రాసిటీ కేసులు ఆంధ్రుల మనసుల్లో ఎప్పటికీ చెరగని గాయాలు. నేటి ఈ తీర్మానం ఆ గాయాలకు ఒక మందులా పనిచేయనుంది.
అసెంబ్లీ తీర్మానం ప్రకారం, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-5ను సవరించడం ద్వారా “అమరావతి” అనే పేరును కేంద్ర చట్టంలోనే చేర్చనున్నారు. “ఏపీ రాజధాని అమరావతి” అని కేంద్ర చట్టంలో స్పష్టంగా ఉండటం వల్ల, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా మార్చడానికి వీలుండదు. చట్టబద్ధత లభించడం వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు మళ్లీ రాష్ట్రానికి వస్తాయి. ఇది ఆర్థిక నష్టాలను అరికట్టి, సంపదను సృష్టిస్తుంది. గందరగోళానికి తెరపడి, రాష్ట్ర అభివృద్ధికి ఇంజిన్ అవుతుంది.
ఇది ప్రజా విజయం!
శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం.. ఆనాడు లాఠీల ముందు తలవంచని అమరావతి మహిళల ధైర్యానికి, ప్రాణాలను పణంగా పెట్టిన అన్నదాతల పట్టుదలకు దక్కిన విజయం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ప్రజాస్వామ్య పోరాటానికి ఒక నిలువుటద్దం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్ట సవరణను త్వరితగతిన పూర్తి చేస్తే, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది.
”అమరావతి అంటే ఆగిపోయిన చరిత్ర కాదు.. అది అడ్డంకులను దాటుకుని వెలిగే ఆంధ్రుల ఆత్మగౌరవ శిఖరం. మరికొన్ని శతాబ్దాల పాటు ఆంధ్రాకు దారి చూపే అఖండజ్యోతి!” వందలాది రైతుల బలిదానాలు, వేలాది మంది ఆడబిడ్డల కన్నీళ్లు వృధా కాలేదు. అసెంబ్లీలో అమరావతి తీర్మానం, కేంద్ర చట్టంలో రాజధాని పేరు చేరిక.. ఈ చారిత్రాత్మక ఘట్టం ఆంధ్రుల ఆత్మగౌరవ విజయం.
