అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయతో పాటు పాడేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 11:31 గంటల సమయంలో సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని సామాగ్రి కదిలిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన వివరాల ప్రకారం, ఈ భూకంప కేంద్రం పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది. అరకు, పాడేరు ప్రాంతాలు ఒరిస్సా సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఇక్కడ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.
