అమరావతి విషయంలో సీఎం చంద్రబాబుకు విజన్ ఉంటే గత ప్రభుత్వం నేతది అంతా వినాశనం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నారాయణ. అమరావతిపై తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటే సహించలేక వ్యవహరిస్తున్నారని గత పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి కేపిటల్ సిటీపై గత పాలకులు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని అన్నారు.
2014-19లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న గత పాలకులు అసెంబ్లీ సాక్షిగా గుంటూరు-విజయవాడ రాజధాని అని ఒప్పుకుని 30 వేల ఎకరాలు కావాలని చెప్పి అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడి ప్రజలను గందరగోళానికి గురిచేసారు.
రైతులపై అనేక కేసులు పెట్టి కోర్టులు చుట్టూ తిప్పారు. మహిళలని కూడా చూడకుండా బూటు కాలుతో తన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమరావతి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతకల వల్ల కమిటీలు వేయడంతో పాటు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వంటి సంస్థల నుండి నివేదికలు తీసుకుని ముందుకు వెళ్లాం.
గతంలో ఎన్నికలకు ముందు టెండర్లు పిలవడంతో కొన్ని పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. కానీ ఈసారి అధికారంలోకి రాగానే 350 కిమీ పొడవున ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లతో పాటు ఎల్పీఎస్ పనులు, భవనాల నిర్మాణాలు పూర్తి స్థాయిలో చేపట్టాం.
ఆ పార్టీ నేతలు ఒకరు రాజధాని ఇక్కడే అంటారు, ఒకరు ఇక్కడ కాదు అంటారు, ఒకరు అక్కడ అంటారు. కానీ పార్లమెంట్ లో అమరావతిపై చట్టం చేస్తున్న సమయంలోనే మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనను ఆ పార్టీ నేతలు తెరమీదకు తీసుకొచ్చారు. అమరావతిలో జరుగుతున్ననిర్మాణాలపై జనాలను తప్పుదోవ పట్టించేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.
హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో లేని రేట్లతో ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. తెలంగాణ సెక్రటేరియట్, పార్లమెంట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అసలు వాస్తవ లెక్కలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ సెక్రటేరియట్, పార్లమెంట్ కు ఖర్చయిన లెక్కలివిగో..
తెలంగాణ సెక్రటేరియట్ ను మొదట్లో 7 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి 615 కోట్లతో టెండర్లు పిలిచారు…ఆ తర్వాత 10 లక్షల 34 వేల చదరపు అడుగులుకు పొడిగించారు…దానికి అయిన మొత్తం ఖర్చు 1,423 కోట్లు. అంటే ఒక్కో చదరపు అడుగుకి సుమారు 13,763 రూపాయలు ఖర్చయింది.
అదేవిధంగా పార్లమెంటు భవనాన్ని 6 లక్షల 94 వేల చదరపు అడుగుల్లో నిర్మించేలా ప్లాన్ చేసారు. భవనం నిర్మాణానికి ముందుగా 862 కోట్లతో టెండర్లు పిలిచారు. డీవియేషన్స్, ఇతర పనులు అన్నీ పూర్తయ్యేసరికి మొత్తం ఖర్చు 1174 కోట్ల రూపాయిలు అయింది. అంటే చదరపు అడుగుకి 16,916 రూపాయలు అయింది.
సాధారణంగా కట్టుకునే ఇళ్లు లేదా విల్లాలకు 4000, 4500 రూపాయిలు మాత్రమే ఖర్చవుతుంది. కానీ ఫ్లోర్ లు పెరిగే కొద్ది ఖర్చు పెరగడంతో పాటు ఐకానిక్ భవనాలుగా నిర్మించడం, ఆ భవనాలకు అవసరమైన ఎంఈపీ పనులకు కలిపి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ అదేమీ చెప్పకుండా ఇష్టానుసారం తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.
అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి తక్కువ ఖర్చవుతున్నప్పుడు అమరావతిలో నిర్మాణాలకు ఎందుకు ఎక్కువ ఖర్చవుతుందని ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి వేయడం అంటే కేవలం రోడ్డు నిర్మాణం మాత్రమే. కానీ అమరావతిలో రోడ్లతో పాటు పక్కనే డ్రెయిన్లు, మంచినీటి పైప్ లైన్లు,విద్యుత్ లైన్లు వంటి అన్ని మౌళిక సదుపాయాలకు కలిపి టెండర్లు పిలుస్తున్నాం.. అందుకే అమరావతిలో రోడ్ల నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు.
అమరావతిని కదల్చలేమని తెలిసే కొత్త డ్రామాలు
పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత రావడంతోనే ఇవన్నీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్క పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు అమరావతికి మద్దతు పలికాయి. అన్ని పార్టీలు మద్దతిస్తే అమరావతి ని రాజధానిగా మార్చడానికి వాళ్లు మళ్లీ ఒప్పుకోరని తెలిసి ఇలా గన్ వ్యవహరిస్తున్నాడు. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదని మళ్లీ మావిగన్ అంటున్నాడు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ కలిపి మావిగన్ అంటున్నారు.
గత ప్రభుత్వం వల్ల పెరిగిన నిర్మాణ వ్యయం
2014-19లో భవనాల నిర్మాణాలు పూర్తయి ఉంటే ఇప్పుడు ఖర్చు బాగా తగ్గిపోయేదన్నారు మంత్రి నారాయణ. అప్పట్లో జీఎస్టీ 12 శాతం ఉంటే ప్రస్తుతం జీఎస్టీ 18 శాతానికి పెరిగింది. అలాగే 2014-19లో బిటుమెన్ టన్నుకి 24,470 రూపాయలు ఉండగా…ప్రస్తుతం 44,862 రూపాయలు ఉందన్నారు..అంటే 83.33 శాతం పెరిగింది.
మెటల్ క్యూబిక్ మీటర్ కు 1365 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1676 రూపాయలుగా ఉందన్నారు. అమరావతిలో పిలిచే టెండర్ల రేట్లను ఎస్ఎస్ఆర్ రేట్లు ప్రకారమే పిలుస్తున్నామని పంచాయితీ రాజ్ అయినా,మున్సిపల్ శాఖ అయినా ఆర్ అండ్ బి కైనా టెండర్లు పిలిచేటప్పుడు ఇవే రేట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుదన్నారు మంత్రి నారాయణ.
2014-19 లో టన్ను స్టీల్ ధర 57,299 రూపాయలు ఉండగా ఇప్పుడు 80,234 రూపాయలుగా ఉందన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి 40.03శాతం పెరిగిందన్నారు. ఇలా ధరలు పెరగడం వల్ల నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయిందని మంత్రి నారాయణ తెలిపారు.
అమరావతిలో ఒకే వర్గానికి కాంట్రాక్టులిచ్చారనేది అవాస్తవం
అమరావతిలో నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఒకే వర్గానికి ఇచ్చేసారనే ఆరోపణల్లో కూడా వాస్తవం లేదన్నారు. ఎంతో మంది కాంట్రాక్టర్లు అమరావతి పనుల్లో భాగస్వాములయ్యారని మంత్రి చెప్పారు. అన్నీ పారదర్శకంగా ఆన్ లైన్ లో టెండర్లు పిలిచామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వారికి కూడా టెండర్ లో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు.
రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు దాదాపు పూర్తి
రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో 98.6 శాతం మందికి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం 31,158 మంది రైతులు భూములివ్వగా 30,074 మందికి ప్లాట్లు కేటాయింపు పూర్తయిందని ఇంకా కేవలం 651 మందికి ప్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు. భూములిచ్చిన రైతులకు 70,790 ప్లాట్లు కేటాయించగా 62,942 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందని మంత్రి అన్నారు. మిగిలిన 7848 మందికి వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందని మంత్రి స్పష్టం చేసారు.
అమరావతిలో పూర్తవుతున్న భవనాల నిర్మాణాలు
అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాలు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యేల నివాసాలు పూర్తి కాగా ఈనెల 15 లేదా 20వ తేదీ నాటికి ఆ ఇళ్లను జీఏడీకి అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్ టవర్స్ కూడా ఈ నెలాఖరుకి పూర్తవుతాయన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆఫీసర్ల క్వార్టర్లు మరో రెండు నెలల్లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని మంత్రి స్పష్టం చేసారు.
అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ సిటీ
అమరావతి ప్రాజెక్ట్ డిజైన్ చేసిన సమయంలోనే సెల్ఫ్ సస్టెయినబుల్ సిటీగా ఉండేలా డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్ లేఅవుట్ ప్లాన్ ఇచ్చినప్పుడు 5 వేల ఎకరాలు మిగిలేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. 5వేల ఎకరాలతో పాటు మిగిలిన భూమిని స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీలకు కేటాయిస్తున్నామన్నారు.
2014-19 లో ల్యాండ్ పూలింగ్ సమయంలో అభివృద్ది చేయని భూమి ధర ఎకరా 7 నుంచి 25 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఎకరం 10 కోట్లుగా ధర ఉంది. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయి. అంటే ఎకరా 20 కోట్లు పలుకుతుంది. కనీసం 50 వేల కోట్లు ఈ భూమిని అమ్మడం ద్వారా సీఆర్డీఏకు వస్తుంది..ఈ నిధులతోనే అప్పులు తీరుస్తాం తప్ప ప్రజలు కట్టే టాక్సులతో అమరావతి అప్పులు తీర్చేది లేదన్నారు.
చంద్రబాబుది విజన్… వాళ్లది వినాశనం
హైదరాబాద్ అభివృద్ది తరహాలో అమరావతి అభివృద్దికి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు పనిచేస్తుంటే వాళ్లు వినాశనం చేసే పనిలో ఉన్నారు. ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసారు. తిరిగి గాడిలో పెట్టడానికి రెండేళ్లు పట్టింది. ఇప్పటికే వారిని ప్రజలు చీకొడుతున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆ సీట్లు కూడా రావని అన్నారు. మావిగన్ అంటూ సొంత పేపర్ లో రోజుకొక రకంగా రాసుకుంటున్నారు. మళ్లీ పెట్టుబడి దారులను రాష్ట్రానికి రాకుండా రాష్ట్రం అభివృద్ది చెందకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండి పడ్డారు..2028 ఆగస్టు కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తవుతుంది.
అమరావతి అభివృద్ది ఎప్పటికీ జరుగుతుంది.. అమరావతి వచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రోడ్లు, డ్రైన్స్, వాటర్, సీనరేజ్, , ఎలక్ట్రిసిటీ సౌకర్యాలు కల్పిస్తే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. అందుకే పక్కా ప్రణాళికతో అమరావతి నిర్మాణం పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని నారాయణ చెప్పారు.
