కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగుస్తున్నందున అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయా లేదా అనే అంశంపై ఉత్కంఠ చెలరేగింది. అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన కీలక చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ, పాకిస్తాన్ సోమవారం దౌత్యపరమైన ప్రయత్నాలను వేగవంతం చేసింది.
ఈ వారాంతానికి ముగియనున్న తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో, చర్చలు తిరిగి ప్రారంభం కావాలని పాకిస్తాన్ తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఇదే సమయంలో హోర్మోజ్ జల సంధి పరిసరాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చర్చలు జరగనున్నాయా అన్న సందేహాలు తలెత్తాయి.
గత వారాంతంలో అమెరికా దళాలు ఇరాన్ జెండా ఎగురవేసిన ఒక కార్గో నౌకను అదుపులోకి తీసుకున్నాయి. ఇరాన్ పోర్టులపై అమలు చేస్తున్న ఆంక్షలను తప్పించుకునేందుకు ఆ నౌక ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ, పాకిస్తాన్ ప్రతినిధితో మాట్లాడుతూ, ఇరాన్ నౌకలు, పోర్టులపై అమెరికా బెదిరింపు చర్యలకు దిగుతున్నదని, అమెరికాకు నిజాయితీ లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చల భవిష్యత్తుపై మరింత అనుమానాలను రేకెత్తించాయి.
ఇప్పటికే కాల్పుల విరమణ గడువు మధ్య వారంలో ముగియనున్న నేపథ్యంలో, గత 24 గంటల్లో పాకిస్తాన్ అధికారులు అమెరికా, ఇరాన్ తో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మంగళవారం నిర్ణయించినట్టుగా చర్చలు కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఈ ఏర్పాట్లలో పాల్గొన్న పాకిస్తాన్ అధికారులిద్దరు తెలిపారు. అయితే అధికారికంగా స్పందించడానికి వారికి అనుమతి లేకపోవడంతో వారు గోప్యత నిబంధనలతో మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రతినిధులు సోమవారం పాకిస్తాన్ రాజధానికి బయలుదేరనున్నారని ప్రకటించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రణాళికలు మారుతాయా అనే అంశంపై స్పష్టత లేదు. మరోవైపు, ఇరాన్ అధికారికంగా ఈ చర్చలపై స్పందించలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా చెబుతున్నదానిప్రకారం చర్చలు జరగకపోవచ్చని సంకేతాలు వస్తున్నాయి.
మొత్తం మీద, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల్లో భద్రతా సమస్యలు, పరస్పర ఆరోపణలు అమెరికా ఇరాన్ చర్చలపై అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ చేపట్టిన దౌత్యపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
