తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీ భారీ రోడ్ షో నిర్వహించి దేశాన్ని ఆశ్చర్య పరిచారు. వారణాసిలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ బుధవారం భారీ రోడ్షో నిర్వహించారు. వారణాసి నగర వీధులన్నీ జనసందోహంతో నిండిపోయాయి.
ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోడ్షో బనారస్ లోకోమోటీవ్ వర్క్స్ నుంచి ప్రారంభమై లహర్తారా, కచహరి, అంబేద్కర్ చౌరాహా, చౌకాఘాట్, టెలియాబాగ్, లహురాబీర్, మైదాగిన్ ప్రాంతాల గుండా ప్రయాణించి చివరకు కాశీ విశ్వనాథుడి ఆలయం వద్ద ముగిసింది.
కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాల మధ్య సంప్రదాయ రీతిలో పూజలు చేసిన అనంతరం స్థానిక ప్రతినిధులు ఆయనకు త్రిశూల్, డమరుకం, శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభివాదం చేశారు.
దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు “హర్ హర్ మహాదేవ్” నినాదాలతో భక్తులు స్వాగతం పలికారు. ప్రధాని చేతులు ఊపుతూ, నమస్కరిస్తూ వారికి ప్రతిస్పందించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ వద్ద చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.
బీజేపీ మీడియా ఇన్చార్జ్ అరవింద్ మిశ్రా ఈ అంశంపై మాట్లాడుతూ, వారణాసిలో ప్రజలు ప్రధానిని చూడడం కోసం భారీగా చేరుకున్నారు. రోడ్షో మార్గం మొత్తం పార్టీ కార్యకర్తలు, స్థానికులు, భక్తులతో కిటకిటలాడింది. పలుచోట్ల ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద గులాబీ రేకులు చల్లి, డోలు వాయిద్యాలు, శంఖనాదాలతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
సుమారు 14 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్షోను నగర చరిత్రలో అతిపెద్ద ర్యాలీలలో ఒకటిగా పార్టీ నాయకులు పేర్కొన్నారు. మార్గమంతా రోడ్ల రెండు వైపులా భారీ జనసంద్రం కనిపించిందని అధికారులు తెలిపారు. వారణాసి పర్యటన అనంతరం, తన లోక్సభ నియోజకవర్గం అయిన ఈ నగరంలో కార్యక్రమాలు ముగించుకున్న ప్రధాని, అదే రోజు ఉత్తరప్రదేశ్లో గంగా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు.
