ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భారత సాయుధ దళాల ధైర్యసాహసాలకు వందనం చేశారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ఇచ్చిన ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ సిందూర్ చేపట్టి గురువారం నాటికి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దేశ రక్షణలో సైన్యం చూపిన అచంచల నిబద్ధత, సమన్వయం, సాంకేతిక సామర్థ్యం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదిక Xలో తన డిస్ప్లే పిక్చర్ను కూడా ఆపరేషన్ సింధూర్ లోగోగా మార్చుకున్న ప్రధాని మోదీ, ఏడాది క్రితం భారత సైన్యం అసాధారణ ధైర్యం, ఖచ్చితత్వం, దృఢసంకల్పంతో పనిచేసిందన్నారు. పహల్గామ్లో అమాయకులపై దాడి చేయడానికి ధైర్యం చేసిన ఉగ్రవాదులకు భారత దళాలు తగిన సమాధానం ఇచ్చాయని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఉగ్రవాదంపై తీసుకున్న కఠిన వైఖరిని ప్రపంచానికి చాటిందని మోదీ అన్నారు. జాతీయ భద్రత పరిరక్షణలో భారతదేశం ఎలాంటి రాజీ పడదనే సందేశాన్ని ఈ ఆపరేషన్ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా భారత సాయుధ దళాల ప్రొఫెషనలిజం, సిద్ధత, పరస్పర సమన్వయం కూడా ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమైందని తెలిపారు.
రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేపట్టిన చర్యలు ఇప్పుడు దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. సైన్యాల మధ్య పెరుగుతున్న సంయుక్త సమన్వయం దేశ రక్షణ వ్యవస్థను మరింత శక్తివంతం చేసిందన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించే వరకు భారత్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు.
