ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభం కావడమే ఆలస్యం..ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో టెన్షన్ మొదలైంది. గత ఐదేళ్ల తమ పాలనలో ఇష్టారాజ్యంగా చేసిన దొంగ ఓట్ల దందా ఎక్కడ బయటపడుతుందో.. తాము చేర్పించిన లక్షలాది బోగస్ ఓట్లు ఎక్కడ గాలిలో కలిసిపోతాయో అన్న భయం ఫ్యాన్ పార్టీ నేతలను వెంటాడుతోంది.
కేంద్ర ఎన్నికల సంఘం – ECI పక్కా వ్యూహంతో రంగంలోకి దిగడంతో, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో ముందస్తుగానే ఏడుపు లంకించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాలంటీర్ వ్యవస్థను, కొందరు అనుకూల అధికారులను అడ్డం పెట్టుకుని విపక్షాల సానుభూతిపరుల ఓట్లను టార్గెట్ చేశారు. ఫామ్-7లను అస్త్రంగా వాడుకుని దొంగ డిలీషన్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో, ఆధునిక సాంకేతికతను వాడుతూ పారదర్శకంగా తనిఖీలు జరుగుతున్నాయి. గతంలో నిబంధనలు ఉల్లంఘించి ఓట్లు తొలగించిన అధికారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభం కావడంతో.. ప్రస్తుత సిబ్బంది కూడా రూల్స్ ప్రకారమే వెళ్తున్నారు. దీంతో వైసీపీ మార్క్ ఘనకార్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఓటర్ల ప్రక్షాళనను ఎలాగైనా అడ్డుకోవాలనే ప్లాన్తో సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. బూత్ లెవల్ ఏజెంట్లను అలర్ట్ చేయడం, కోర్టులను ఆశ్రయించడం అంటూ హడావుడి స్టార్ట్ చేశారు. అయితే, ఈ ఆరాటం నిజమైన ఓటర్లను కాపాడుకోవడానికి కాదు..గతంలో దొడ్డిదారిన చేర్చిన బోగస్ ఓట్లను కాపాడుకోవడానికేననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక నియోజకవర్గంలో ఉంటూనే మరో నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండటం, చనిపోయిన వారి పేరుతో ఓట్లను కొనసాగించడం వంటి అక్రమాలకు ఈ ప్రక్షాళనతో శాశ్వతంగా చెక్ పడనుంది. నిజమైన ఓటర్లకు ఎలాంటి ఢోకా లేదని అధికారులు స్పష్టం చేస్తున్నా.. వైసీపీ మాత్రం దీన్ని పొలిటికల్ డ్రామాగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.
