వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ నుంచి పరారీలో ఉన్న నీరవ్ మోడీపై లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టు మంగళవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్షాన తీర్పు వెలువరించింది.
దుబాయ్కు చెందిన ఫైర్స్టార్ డైమండ్ ఎఫ్జెడ్ఈ సంస్థకు మంజూరైన రుణానికి నిరవ్ మోదీ వ్యక్తిగత హామీ ఇచ్చినందున, రుణ చెల్లింపులకు ఆయన వ్యక్తిగతంగా బాధ్యుడని కోర్టు స్పష్టం చేసింది. 2012లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణ సదుపాయాన్ని మంజూరు చేసింది. అదే ఏడాది ఆగస్టు 3న నిరవ్ మోదీ వ్యక్తిగత గ్యారంటీపై సంతకం చేసి, రుణగ్రహీత సంస్థ బకాయిలు చెల్లించకపోతే తానే చెల్లిస్తానని అంగీకరించారు.
అయితే సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలమైన తర్వాత బ్యాంక్ స్వతంత్రంగా బకాయిల వసూళ్ల ప్రక్రియను ప్రారంభించింది. పలుమార్లు నోటీసులు పంపినా ఎటువంటి చెల్లింపులు జరగలేదని బ్యాంక్ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో వ్యక్తిగత గ్యారంటీ అమలు చేయలేమని నిరవ్ మోదీ తరపు న్యాయవాదులు వాదించారు.
రుణాన్ని తక్షణ వసూళ్లకు తరలించేందుకు బ్యాంక్కు సరైన ఆధారాలు లేవని, చెల్లింపు డిమాండ్ కూడా చట్టబద్ధంగా లేదని పేర్కొన్నారు. అలాగే 2018 ఏప్రిల్, 2025 అక్టోబర్లో పంపిన నోటీసులు తనకు అందలేదని వాదించారు.
అయితే ఈ వాదనలను కోర్టు తిరస్కరించింది. బ్యాంక్ పంపిన నోటీసులు చట్టబద్ధంగా అందినట్లేనని నిర్ధారిస్తూ నిరవ్ మోదీపై బకాయిల చెల్లింపు బాధ్యత కొనసాగుతుందని తీర్పు ఇచ్చింది.
రూ.13,000 కోట్లకు పైగా విలువైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నిరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్లో న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ తాజా తీర్పు ఆయనకు మరో కీలక న్యాయ పరాజయంగా భావిస్తున్నారు.
దుబాయ్లో ఆయన నిర్వహించిన సంస్థకు సంబంధించిన రుణ బకాయిల విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 10.7 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా (రూ.100 కోట్లకుపైగా) చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశించింది.
