కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
రాజకీయ కక్షతోనే కేసు
రాహుల్గాంధీపై అక్రమంగా, రాజకీయ కక్షతో కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ అనంతరం ప్రాంగణ శుద్ధీకరణ అవమానకర ఘటనపై ప్రశ్నించినందుకే రాహుల్పై కేసు పెట్టడం దుర్మార్గమన్నారు.
దళితుల ఆత్మగౌరవం కోసం మాట్లాడితే నేరమా?
దళితుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం రాహుల్గాంధీ మాట్లాడారని మంత్రి తెలిపారు. రాహుల్గాంధీ స్వయంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయగా.. ఆయనపైనే అదే చట్టం కింద కేసు పెట్టడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. దళితులపై వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడటం నేరమా? రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం కోసం ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని, రాహుల్గాంధీపై నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలు పట్టవు.. ప్రతిపక్షాలపై కేసులా?
దేశంలో నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని జూపల్లి ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా.. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
