విజయనగరంహోమ్

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే తిరుగుబాటు తప్పదు!

#CPIVijayanagaram

ప్రజా సొమ్ముతో నిర్మించబడిన ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థను దశలవారీగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి నెట్టే ప్రమాదకర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీపీఐ నేత అశోక్ విమర్శించారు. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం ద్వారా ప్రైవేటీకరణకు పునాది వేసిన ప్రభుత్వం నేడు విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతోందని విమర్శించారు.

ఈ విధానం అమలైతే శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆర్టీసీ సంస్థను పాలకులు తమ రాజకీయ ప్రచారార్భాటాలకి ఉపయోగించుకుంటూ, మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూములు, ఆస్తులను కారుచౌకగా లీజుల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు పన్నడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నడపాలి

విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూరుస్తున్న నేపథ్యంలో, ఆ బస్సులను పూర్తిగా ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనుగోలు చేసి నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణాను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ఏఐటీయూసీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.

ఒకవైపు ‘స్త్రీ శక్తి’ పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ, మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటూ, చివరకు ఆర్టీసీ నష్టాల్లో ఉందనే నెపంతో ప్రైవేటీకరణను సమర్థించడం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమని విమర్శించారు.

గత కొన్నేళ్లుగా ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకపోవడం, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఆర్టీసీ తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందన్నారు. ఆర్టీసీకి వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళ్లిందో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని ప్రచారం చేసుకోవడం తప్ప ఉద్యోగులకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు కల్పించలేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే రివిజన్ అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు, సామాజిక భద్రతా చట్టాల అమలు, ఏపీకాస్ (APCOS) విధానం అమలు, ఆన్‌కాల్ డ్రైవర్ వ్యవస్థ రద్దు వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ప్రజల ఆస్తులను కాపాడటం, ప్రజా రవాణాను పరిరక్షించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి ప్రైవేటీకరణకు పాల్పడితే ప్రజా ఉద్యమాల తీవ్రతకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందని బుగత అశోక్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్. రంగరాజు, జిల్లా కార్యదర్శి కె. వి. రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ. రాములు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎస్. శ్రీను, ప్రభాకర్ పట్నాయక్, టిఎస్ఎన్ రాజు, కె.వెంకటరమణ, కె. ఎన్. స్వామి, జివిఎమ్ రాజు, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎమ్. జోగారావు, యు. అప్పన్న, కె. ఈశ్వరరావు మరియు ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Satyam News

న్యూయార్క్ లో తెలంగాణ జానపద పండగ

Satyam News

ప్రాణాలు పోతున్నా వడ్ల రైతుల్ని పట్టించుకోవడం లేదు

Satyam News

వంద కోట్ల విలువైన స్ధలం కబ్జా చెర నుంచి విముక్తి

Satyam News

నువ్వు ముస్లిం అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా రహమాన్?

Satyam News

వీసాల పట్ల అప్రమత్తత అవసరం

Satyam News

Leave a Comment