విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో ప్రముఖ ఆన్లైన్ వార్తా పోర్టల్ న్యూస్క్లిక్ (NewsClick) దాని డైరెక్టర్ ప్రబీర్ పుర్కాయస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ నిధుల సమీకరణ, వాటి వినియోగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారించిన ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ, మొత్తం 184 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
ఈ జరిమానాలో న్యూస్క్లిక్ సంస్థ (PPK Newsclick Studio Pvt Ltd) 120 కోట్ల రూపాయలు, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ 64 కోట్ల రూపాయలు చెల్లించాలని ఈడీ స్పష్టం చేసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ పలు కీలక అంశాలను వెల్లడించింది. 2018-19 మధ్యకాలంలో సుమారు 9.59 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) వ్యాపార స్వభావాన్ని తప్పుగా చూపడం ద్వారా సమీకరించారని ఈడీ పేర్కొంది.
అంతేకాకుండా, 2018 నుంచి 2024 మధ్య కాలంలో సేవల ఎగుమతి పేరుతో వచ్చిన సుమారు 82.63 కోట్ల రూపాయల విదేశీ నిధుల్లో కూడా భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిధుల లావాదేవీలన్నీ కావాలనే చట్ట నిబంధనలను తప్పించుకునేలా సాగాయని ఈడీ తన నివేదికలో వెల్లడించింది.
న్యూస్క్లిక్కు చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చైనా అనుకూల ప్రచారాన్ని భారత్లో చేపట్టేందుకు అమెరికా మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘం ద్వారా ఈ నిధులు అందినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రబీర్ పుర్కాయస్థ బెయిల్పై బయట ఉన్నప్పటికీ, తాజా జరిమానా ఉత్తర్వులు ఆ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. అయితే, తాము అన్ని నిబంధనల ప్రకారమే నిధులు సేకరించామని, బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే లావాదేవీలు జరిగాయని న్యూస్క్లిక్ యాజమాన్యం వాదిస్తోంది.
