Uncategorized

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి!

#YSJagan

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ కీలకంగా ఉన్న సీనియర్ నేత వైపీపీకి గుడ్‌ బై చెప్పేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరు మాజీ మంత్రులను ఆ నియోజకవర్గం ఇంఛార్జ్‌లుగా నియమిస్తే.. ఆ దిక్కు కూడా చూడకుండా దండం పెట్టి పారిపోయారు. అదే రేపల్లె నియోజకవర్గం. టీడీపీ నాయకుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పెట్టని కోట.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ అనగాని హవానే కొనసాగింది. 2019లో వైసీపీ వేవ్‌ స్వీప్‌ చేసిన సమయంలోనూ రేపల్లెలో గెలుపు అనగాని సత్యప్రసాద్‌నే వరించింది. అలాంటి బలమైన నేతను ఢీకొట్టడానికి పీటా నాగ మోహన కృష్ణ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని రేపల్లె వైసీపీ ఇంఛార్జ్‌గా నియమించారట.

రేపల్లెలో వైసీపీ చరిత్ర చూసుకుంటే.. సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ 2014, 2019 ఎన్నికల్లో అనగాని సత్యప్రసాద్‌ మీద ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మోపిదేవికి ముందు ఎమ్మెల్సీ, తర్వాత రాజ్యసభ సీటిచ్చి రేపల్లె నుంచి సైడ్‌ చేశారు. 2024లో ఫ్యాన్‌ పార్టీ గుర్తుపై ఈపూరు గణేశ్‌ని బరిలోకి దించినా ఓటమి తప్పలేదు.

వైసీపీ ఘోర పరాజయం తర్వాత మోపిదేవి జగన్‌ పార్టీని, రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేసి టీడీపీలో జాయిన్‌ అయ్యారు. ఈపూరు గణేశ్‌ కూడా ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి విడదల రజనీని రేపల్లె ఇంఛార్జ్‌గా ప్రకటించారు. కానీ ఆమె రేపల్లె వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. గుంటూరు వెస్ట్‌లో ఓడిపోయాక అటు నుంచి అటే చిలకలూరిపేట చెక్కేశారు.

మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వస్థలం రేపల్లె కావడంతో.. ఆయన్ను అక్కడ వైసీపీ ఇంఛార్జ్‌గా వెళ్లమన్నారు. అంబటి రేపల్లె వెళ్లడానికి ఇష్టపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పీటా మోహన కృష్ణ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని ఇంఛార్జ్‌గా నియమించారు. ఆయనేమో వచ్చీ రాగానే రప్పా రప్పా డైలాగులు.. ఫెక్సీలు చింపడం వంటి వివాదాలతో ఎంట్రీలోనే పబ్లిక్‌లో బ్యాడ్  అయిపోయారు.

ఎవరైనా కొత్త ఇంచార్జ్‌గా వస్తే.. స్థానిక నాయకులు, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. ఇతను మాత్రం రెచ్చగొట్టే రాజకీయాలను నమ్ముకొన్నారు. ఇలాగైతే ఈ మూడో కృష్ణుడు కూడా ఎంతోకాలం రేపల్లె వైసీపీ ఇంఛార్జ్‌గా ఉండరనే టాక్‌ వినిపిస్తోంది. రేపల్లెలో వైసీపీ రాజకీయాలు ఇలా ఉంటే.. అక్కడ టీడీపీకి మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు.. మోపిదేవి వెంకటరమణ వంటి బలమైన నాయకత్వం ఉంది.

టీడీపీ హేమా హేమీలను ఢీకొట్టడానికి వైసీపీ త్వరలోనే నాలుగో కృష్ణుడి కోసం వెతుక్కోవాల్సి వస్తుందని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

Satyam News

కుక్కలు కాదు.. పిచ్చి కుక్కలు…. షర్మిల ఎదురుదాడి….!!

Satyam News

Leave a Comment