ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ నేడు గుంటూరులోని సీసీఎస్ (CCS) పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన దర్యాప్తు అధికారి ముందు విచారణకు వచ్చారు.
గతంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం సునీల్ నాయక్ ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వరుసగా విచారణకు హాజరయ్యారు. అయితే, మార్చి 12న జరిగిన విచారణకు ఆయన హాజరుకాలేదు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసేందుకు పట్నా వెళ్లాల్సి ఉందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. ఆ విరామం అనంతరం కోర్టు సూచనల మేరకు నేడు తిరిగి విచారణ అధికారి ఎదుట హాజరయ్యారు.
మరోవైపు, సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అర్హత పిటిషన్పై కూడా నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. తాజా విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
